
రైలు ఢీకొని ముగ్గురు మృతి
చీరాల రూరల్: రైలు ఢీకొన్న ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం సుమా రు మూడు గంటల సమయంలో దిగువ లైన్పై వృద్ధుడు మృతి చెందాడనే సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై చెప్పారు. మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయ, తెలుపు తల వెంట్రుకలు, ఛాతీ ఎడమవైపు ఒక పుట్టుమచ్చ, కుడితొడపై మరో పుట్టుమచ్చ కలిగి ఉన్నాడని తెలిపారు. శరీరంపై తెలుపురంగు అరచేతుల చొక్కా, నీలం, తెలుపు రంగుల చారలు కలిగిన లుంగీ ఉందని, మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే 9440627646 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.
రైలు నుంచి జారిపడి..
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై కొండ య్య శుక్రవారం తెలిపారు. సుమారు 30 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని యువకుడు ఎగువకు వెళ్లే గుర్తు తెలియని రైల్లో ప్రయాణిస్తూ చినగంజాంలోని సోపిరాల రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు జారిపడి బలమైన రక్త గాయాలు కావడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుడిచేతి షోల్డర్ మీద విజయలక్ష్మి అనే పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిస్తే జీఆర్పీ ఎస్సై 9440627646 నంబర్కుసమాచారం అందించాలని సూచించారు.
చినగంజాంలో...
చినగంజాం: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చినగంజాం రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. చినగంజాం రైల్వేస్టేషన్కు ఉత్తరం వైపు సుమారు అరకిలోమీటరు దూరంలో విజయవాడ నుంచి చైన్నె వెళ్లే లైన్లో రైలు నుంచి జారిపడి తీవ్రగాయాల పాలై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని రైల్వే ఎస్ఐ కొండయ్య వివరించారు.