
తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
నరసరావుపేట ఈస్ట్: విశాఖ ఉక్కు కర్మాగారంలో అన్యాయంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే దానిలో భాగంగా కార్మికుల తొలగింపును చేపట్టడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు –ఆంధ్రుల హక్కు నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను నేడు పథకం ప్రకారం నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలని చూడటం దారుణమన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు, గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉప్పలపాటి రంగయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సత్యనారాయణరాజు, అంజిరెడ్డి, ఎం.నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ఎస్.దేవి, దీనమ్మ తదితరులు పాల్గొన్నారు.