
బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను తొలగించాలి
నగరంపాలెం: సెన్సార్ బోర్డ్ను కేంద్రం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్శర్మ అన్నారు. గురువారం నగరంలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, భాజపా రాష్ట్ర నాయకులకు బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి సంయుక్తంగా వినతిపత్రం అందించాయి. నటుడు మంచు మోహన్బాబు నిర్మించిన కన్నప్ప చిత్రంలో సనాతన ధర్మాన్ని కించపరిచారని శ్రీధర్శర్మ వారికి వివరించారు. గతంలో ‘దేనికై నా రెడీ’ చిత్రంలో ఇలాగే మనోభావాలకు కించపరిచేలా ప్రవర్తించారని గుర్తుచేశారు. ఏపీ అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వరశాస్త్రి మాట్లాడుతూ కన్నప్ప చిత్రంలో బ్రాహ్మణ జాతి మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని వాపోయారు. చిత్రంలో ఆ సన్నివేశాలు తొలగించేలా అధికారులకు ఆదేశించాలని వారు కోరారు. దర్శనపు శ్రీనివాస్, ఐలూరు శ్రీనివాస్, యనమదల ఆంజనేయులు, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వేదాంతం లక్ష్మణ్, అర్చక, పురోహిత బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.