
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని బుధవారం బాపట్లకు విచ్చేసిన ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డికి బాపట్ల ఆర్టీసీ డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మున్నంగి కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పాత బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన బాపట్లకు అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త సర్వీసులు అందుబాటులోకి తేవాలని కోరారు. జిల్లా కేంద్రం స్థాయికి తగ్గట్టు ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అద్దె బస్సుల కార్మికులకు చట్ట ప్రకారం వేతన సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యుత్ బస్సులు కేటాయించాలన్నారు. పీఆర్సీ, డీఏలను వెంటనే మంజూరు చేసేందుకు కృషి చేయాలన్నారు. చీరాల– బాపట్ల డిపోలలో సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా నియమించాలన్నారు. బాపట్ల గ్యారేజీ, కొత్త బస్టాండులో గుంతలను పూడ్చివేయించాలని కోరారు. యూనియన్ నాయకులు భోగిరెడ్డి తిరుమలరెడ్డి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ను సురేష్ రెడ్డి పరిశీలించారు. మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి సిబ్బందికి సూచనలు చేశారు. ఆర్టీసీ డిపో, కొత్త బస్టాండు, పాత బస్టాండులో సమస్యలను డిపో మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. కొత్త బస్టాండ్ ఆవరణలో నిలిచిన వర్షపు నీటిలోనే ఆయన పర్యటిస్తూ గుంతలమయమైన ప్రాంగణం చూసి అసహనం వ్యక్తం చేశారు. మరమ్మతులకు తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.