
వక్ఫ్ ఆస్తులను కాపాడుకుందాం
లక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు. పాత గుంటూరులోని ిసీఐటీయూ కార్యాలయంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు పూర్తి ఆమోదం ఇవ్వనప్పటికీ, దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం – 2025 త్వరితరగతిన అమలు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గుంటూరులోని పెద్ద మసీదు, ప్రతిపాడు మండలం కొత్త మల్లాయపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 232–1, 2లో 233.18 ఎకరాలు, అంజుమనే ఇస్లామియా సంస్థకు సంబంధించిన చిన్న కాకానిలోని ఎన్నారై ఆసుపత్రి వెనుక ఉన్న 78 ఎకరాలను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి పేరుతో ఏపీఐఐసీకి బదలాయించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఖండించారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. చిష్టి మాట్లాడుతూ రూ. 600 కోట్ల విలువ కలిగిన ఆస్తులను బదలాయించడం వక్ఫ్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఆస్తులు నిర్వహణ పారదర్శకంగా జరగాలని, అవి కేవలం పేద ముస్లిం ప్రజల సంక్షేమం కోసమే వినియోగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీం, ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకుడు ఖాజావలి, ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బషీర్ అహ్మద్, డీఎంఎస్ జాతీయ నాయకుడు కె.వినయ్ కుమార్, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్ రెడ్డి, హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ నాయకుడు ఎండీ జబ్బార్, సీఐటీయూ నాయకుడు కె.నళినీకాంత్, కౌలు రైతు సంఘం నాయకుడు బి.శ్రీనివాసరావు, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు ఎస్.కె. బాజీ, టోపీ బాబు, ఆవాజ్ నాయకులు ఖాసీం వలి, ఎస్.కె.సైదా పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం