
బాల్యవివాహాలతో జీవితాలు చిన్నాభిన్నం
రేపల్లె: బాల్యవివాహాలతో బాలల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని, బాలికలపై లింగవివక్షతను వీడాలని సీడీపీఓ సుచిత్ర పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 24వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం సమ్మర్ ప్రత్యేక క్యాంపులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాలలో రాణిస్తున్నారని చెప్పారు. లింగవివక్ష చూపేవారు చట్టరీత్య శిక్షర్హులన్నారు. బాల్య వివాహాల కట్టడికి ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుత సమాజంలో సైబర్నేరాలు అధికంగా ఉన్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం తమ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని, తమ వ్యక్తిగత సమాచారంను ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు. కిశోర బాలికలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తల్లిదండ్రులకుగాని, ఉపాధ్యాయులకుగాని తెలియజేయాలని సూచించారు. అనంతరం బాల్యవివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి హిమబిందు, సూపర్వైజర్ శివజ్యోతి పాల్గొన్నారు.
సీడీపీఓ సుచిత్ర