
బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపుదలే లక్ష్యం
సత్తెనపల్లి: బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యంగా కిశోరి వికాసం పేరుతో అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పి.ప్రశాంత్ అన్నారు. కిశోరి వికాసంలో భాగంగా పట్టణంలోని 18వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కౌమార దశలో బాలికల్లో అనారోగ్య సమస్యలు, ఇతర ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కిశోర వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత నెల 2వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారంతో ముగిసిందన్నారు. ప్రధానంగా మహిళా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బాలల హక్కులు, చట్టాల మీద వీడియో క్లిప్పింగ్ చూపిస్తూ పిల్లలకు, తల్లులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఐసీడీఎస్ సత్తెనపల్లి ప్రాజెక్టు సూపర్వైజర్ ప్రమీల, అంగన్వాడీ కార్యకర్తలు టి.వరలక్ష్మి, జోజికుమారి, ఆయాలు ఎన్.భారతి, కుమారి, కౌమార బాలికలు, తల్లులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్