
సాక్షి పత్రిక ప్రతినిధులు, పాత్రికేయులు ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: మంగళగిరి ఆత్మకూరులోని సాక్షి యూనిట్ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం దాడి చేసిన సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో పత్రిక ప్రతినిధులు, పాత్రికేయులు మంగళవారం ఫిర్యాదు చేశారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ను సాక్షి మంగళగిరి ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్ గోపి, బ్యూరోలు రమేష్, అశోక్, ఇతర మీడియా మిత్రులతో కలసి ఫిర్యాదు చేశారు. ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి కార్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి కేసు నమోదు చేయాలని ఎస్ఐ వెంకట్ను వారు కోరారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి
అద్దంకి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం మండలంలో పర్యటించారు. దానిలో భాగంగా పట్టణంలోని గరటయ్య కాలనీకి సమీపంలో నూతనంగా రూ.1.46 కోట్లతో నిర్మించిన యూపీహెచ్సీ భవనాన్ని ప్రారంభించారు. తరువాత గోవాడ గ్రామంలో బీటీ రోడ్డును, కొటికలపూడి గ్రామంలో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను, పార్వతీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొటికలపూడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని క్లస్టర్ హైరింగ్ సెంటర్కు రాయితీపై డ్రోన్ను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళీ, అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించిన జోన్ చైర్మన్
పట్నంబజారు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ను మంగళవారం ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ ఎస్.సురేష్రెడ్డి సందర్శించారు. గుంటూరు–1, 2 డిపోల పరిధిలోని గ్యారేజీలను తనిఖీ చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో తిరుగుతూ ప్రయాణికులను బస్సులో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ పరిధిలో స్టాల్స్ను స్వయంగా తనిఖీ చేశారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ ఆర్ఎం రవికాంత్తో కలిసి రికార్డులు పరిశీలించారు.
రవాణా శాఖలో బదిలీలు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో బదిలీలు జరిగాయి. గుంటూరులో మోటార్ వాహనం తనిఖీ అధికారులు గోపాల్ను చిలకలూరిపేటకు, సంధ్య నెల్లూరుకు, అనిల్ కందుకూరుకు, బాలకృష్ణ మంగళగిరికి బదిలీ అయ్యారు. వారి స్థానంలో నరసరావుపేట మంగళగిరిలో విధులు నిర్వహిస్తున్న శ్రావ్య, విజయ సారథి గుంటూరుకు బదిలీ అయ్యారు. మంగళగిరిలో అసిస్టెంట్ మోటర్ వాహన తనిఖీ అధికారిగా పనిచేస్తున్న పవన్ నరసరావుపేటకు బదిలీ అయ్యారు. నెల్లూరులో విధులు నిర్వహించే సాయి ధరమ్ తేజ్ తెనాలికి బదిలీ అయ్యారు.
భక్తులతో పోటెత్తిన కార్తికేయుని ఆలయం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. స్వామివారి నిత్యకల్యాణంలో 73 జంటలు పాల్గొన్నాయి. ఒక్క రోజునే రూ.9,07,678ఆదాయంవచ్చిందని తెలిపారు.

ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ ఎస్.సురేష్రెడ్డి

భక్త సంద్రం