
కమనీయం వేణుగోపాలుని కల్యాణం
యద్దనపూడి: వేదమంత్రాలు, సుమంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. మండలంలోని పూనూరు గ్రామంలో కొలువై ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అర్చకులు దీవి భావనాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజాపక ఆరాధన, ధ్వజారోహణం, ధ్వజపూజ, భేరిపూజ, సంప్రోక్షణ హోమాలు నిర్వహించారు. తదుపరి స్వామివారి మూలవిరాట్లకు సుప్రభాతసేవలు, పంచామృతాభిషేకాలు, విశ్వక్ష్సేణపూజ, పుణ్యాహవచనం, రక్షబంధనం, వేద్యాయనం, హోమాలు, నిర్వహించి స్వామివారి మూలవరులకు సువర్ణ, రత్న ఆభరణ అలంకారం, విశేషపూలంగి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఉత్సవమూర్తులను పసిడి, రజిత వజ్రాభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం 7 గంటలకు ముమ్మారు గర్భగుడి ప్రదక్షిణ చేయించారు. తదుపరి విద్యుత్ కాంతుల ధగధగలతో వెలుగులీనుతున్న ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణవేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. కల్యాణ వేదికపై స్వామివారు తన ఉభయదేవేరులతో కలిసి ముగ్దమనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సంప్రదాయంగా పట్టుపంచె ధరించి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కల్యాణ క్రతువును నారాయణం పవన్కుమార్, నారాయణం శ్రీనివాసాచార్యులు, నారాయణం మనోజ్ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ఆలయ ఈఓ జీవీఎల్ కుమార్, కల్యాణ ఉభయదాత రాటకొండ హనుమంతరావు, రాధిక దంపతులు స్వామివార్లకు తలంబ్రాలు, తాళిబొట్టు, కల్యాణ వస్త్రాలు సమర్పించారు. ఆలయాన్ని విద్యుత్దీపాలతో అలంకరించారు. కల్యాణం అనంతరం స్వామివారి తలంబ్రాలను, తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారు.

కమనీయం వేణుగోపాలుని కల్యాణం