
ఫలించిన గురువుల పోరాటం
గుంటూరుఎడ్యుకేషన్:ఎస్జీటీల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేసి, మాన్యువల్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు ఫలించాయి. డీఈవో కార్యాలయాల ముట్టడి, నిరాహార దీక్షలతో ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ప్రభు త్వం దిగి వచ్చింది. ఎట్టకేలకు మాన్యువల్ కౌన్సెలింగ్కు అంగీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో మాన్యువల్ విధానంలో జరగనున్న కౌన్సెలింగ్కు హాజరుకావాలంటూ విద్యాశాఖాధికారులు సోమవారం రాత్రి ఉపాధ్యాయులకు సమాచారాన్ని చేరవేశారు.
తొలుత 350 మందికి పిలుపు
సీనియార్టీ జాబితాలో పేర్లు ఉన్న మొదటి 350 మంది ఉపాధ్యాయులను పిలవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా వారంతా జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభించాలి. విద్యా శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి సీనియార్టీ జాబితాలతో పాటు కౌన్సెలింగ్కు సంబంధించి విధి, విధానాలు రావాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులను వేచి ఉండమని చెప్పారు. రాత్రి 8.30 గంటలకు కూడా పిలవక పోవడంతో ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు జెడ్పీ ప్రాంగణంలోని చెట్ల కింద గడిపారు. రాత్రి 8.30 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రారంభించని అధికారులు సాంకేతిక కారణాలతో బుధవారం ఉదయానికి వాయిదా వేశారు.