
మూడు బైకులు ఢీ
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని రాజంపేట గుండ్లూరు క్రాస్ రోడ్డులో మూడు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బోయనపల్లిలో ఇంజినీరింగ్ చదువుతున్న గుంటూరుకు చెందిన మోహనకృష్ణ(20) మృతి చెందాడు. రామాపురానికి చెందిన ఇద్దరు, చొప్పావారిపల్లికి చెందిన ఇద్దరు, సమీప తోటలో పనిచేసే మరో వ్యక్తి గాయపడ్డారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు.
కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ ఇవ్వాలి
లక్ష్మీపురం: కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వాలని, భూ యజమాని సంతకం తొలిగించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతుల సమస్యలపై ఈనెల 11న నిర్వహిస్తున్న ‘చలో మంగళగిరి’ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఎన్నికల ముందు కూటమి నేతలు పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తామని, భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ కిందట రూ. 20 వేలు ప్రతి కౌలు రైతుకు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా పథకాలు ఊసే లేదని విమర్శించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షులు బి.రామకృష్ణ, సహాయ కార్యదర్శి పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పాల్గొన్నారు.
జిల్లా ఏడీఎంగా సత్యనారాయణ చౌదరి
కొరిటెపాడు: గుంటూరు జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులుగా అనంతపురం జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న సత్యనారాయణ చౌదరి నియమితులయ్యారు. ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లా ఏడీఎంగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న బి.రాజబాబు తిరువూరు మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా నియమితులయ్యారు. మరో రెండు రోజుల్లో ఏడీఎంగా సత్యనారాయణ చౌదరి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పలువురికి గాయాలు

మూడు బైకులు ఢీ