
శ్రీవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవదాయ శాఖ అధికారు
గుంటూరు రూరల్: గోరంట్లలోని శ్రీలక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని దేవదాయ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. స్వామి వారి రూ.9 కోట్లు విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను ఈఓ వెంకటేశ్వరరావుకు ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, నల్లపాడు సీఐ వంశీధర్, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో వేణుగోపాల్ వాటిని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 22 సంవత్సరాల కిందట దేవాలయాన్ని ప్రతిష్టించామని, అప్పటి నుంచి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ కొంతమంది పనిగట్టుకొని కావాలనే వేణుగోపాల్ పైన అభాండాలు వేయడం వల్ల దేవదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయన హయాంలోనే భక్తులు ఇచ్చిన కానుకలతో స్వామికి ఆభరణాలు చేయించారని చెప్పారు. లాకర్లో ఉన్న ఆభరణాలను తీసి అందరి సమక్షంలో ఆయన అధికారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. గోరంట్లలో తొమ్మిది దేవాలయాలను నిర్మించిన వేణుగోపాల్ సేవలు ఇంకా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు కంచర్ల ఆంజనేయులు, ఆల శివారెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, నాగేశ్వరరావు, మహేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు.