మదనపల్లె టౌన్ : పట్టణంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మదనపల్లె ఎకై ్సజ్ సీఐ భీమలింగా తెలిపారు. సోమవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర కాలనీ వద్ద బెల్ట్ షాపు నడుస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ జెబివుల్లా, సిబ్బంది వెళ్లి నిర్వాహకుని ఇంట్లో సోదా చేశారని చెప్పారు. బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 మద్యం బాటిళ్లను సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసిన అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించామని సీఐ వెల్లడించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు
మదనపల్లె ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 26 మద్యం షాపులు, 6 బార్లు ఉన్నాయని సీఐ తెలిపారు. సెట్టింగ్ రూములు కాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ దాడుల్లో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని భీమలింగా హెచ్చరించారు.
విద్యార్థి అదృశ్యం:
కేసు నమోదు
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. విద్యార్థి తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలంలోని మల్లెలకు చెందిన రోహిత్ రెడ్డి(13) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం విద్యార్థి అదశ్యం కావడంతో స్కూల్ యాజమాన్యం వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
దువ్వూరు : దువ్వూరు మండలం కడప – కర్నూలు జాతీయ రహదారిపై పెద్దజొన్నవరం మెట్ట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొనికి వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పెద్ద జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన రేకులకుంట పెద్ద సుబ్బరాయుడు (50) కూలి పనికి వెళ్లి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి కడపకు వెళుతున్న టాటా నెక్సాన్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెద్ద సుబ్బరాయుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. అతనికి భార్య జయలక్ష్మి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు.
జాతీయ స్థాయి
చెస్ టోర్నీలో ప్రతిభ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బెంగళూరులోని మార్తహళ్లి, లేక్ వ్యూ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 21న నిర్వహించిన రెండో చెస్ టైటాన్స్ ఓపెన్ ఏజ్ కేటగిరీ టోర్నమెంట్ జాతీయ స్థాయి చెస్ పోటీల్లో కడపకు చెందిన క్రీడాకారిణులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించినట్లు అనీష్ దర్బారి చెస్ అకాడమీ చీప్ కోచ్ అనీష్ దర్బారి తెలిపారు.అండర్–16 బాలికల విభాగంలో గోరంట్ల తేజోమయి 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానం, అండర్–12 బాలికల విభాగంలో గంట లక్ష్మీ మానస్రీ 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి 5వ స్థానం పొందినట్లు చెప్పారు. నిర్వాహకులు వీరికి ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా నుంచి పాల్గొన్న ఇతర క్రీడాకారులు కూడా మంచి ఆటతీరును ప్రదర్శించారన్నారు.


