వీరపునాయునిపల్లె : వేంపల్లె– యర్రగుంట్ల ప్రధాన రహదారిలో మర్రిపల్లె క్రాస్ వద్ద శనివారం జరిగిన ఆటో ప్రమాదంలో వీరపునాయునిపల్లె గ్రామం మారుతీ నగర్కు చెందిన ఆవుల శివరాజ్యలక్ష్మి(21) దుర్మరణం చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శివరాజ్యలక్ష్మికి ఏడాది క్రితం వివాహమైంది. ఆమె తన అత్తతో కలిసి ప్రతి రోజు కూలి పనులకు వెళ్లేది. అందులో భాగంగానే శనివారం యరమలపల్లె గ్రామానికి చెందిన మునగల భాస్కర్రెడ్డి ఆటోలో పెండ్లిమర్రి మండలం బాలయ్యగారిపల్లెకు వెళ్లడం జరిగింది. తిరుగు ప్రయాణంలో ఆటో అతి వేగంతో నడపడంతో రోడ్డులో ఉన్న చిన్నపాటి గుంతలో పడి ఎగరడంతో ఆమె కిందపడింది. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త పవన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.


