తాడేపల్లి: చంద్రబాబు అరాచక పాలనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ అయ్యారు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో చేస్తున్న అక్రమ అరెస్టులు, వేధింపులపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘చంద్రబాబూ.. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా? మీరు చెప్పనిది చూపించారా?
వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతనిపై అక్రమ కేసు పెట్టడం ఏంటి? అతని ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? అతనేమైనా ఉగ్రవాదా? మరి మీరు పెడుతున్న పోస్టులకు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం జంగిల్ రాజ్ కాదా? ’ అని ప్రశ్నించారు
.@ncbn గారూ.. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2026
ఇది రెడ్బుక్ పాలనకు నిదర్శనం కాదా?
ఇంట్లో తాను లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంట్లో తిష్టవేయడం ఏంటి? అని వైఎస్ జగన్ నిలదీశారు. ‘ఇది రెడ్బుక్ పాలనకు నిదర్శనం కాదా? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? గడిచిన రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు.. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు కరెక్ట్?
మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నా వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వ్యవస్థలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సుపరిపాలనా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా?
అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్రమ కేసులు, అరెస్టులకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని వైఎస్ జగన్ విమర్శించారు.


