సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం త్వరలో సర్ ప్రక్రియను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సర్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల మనం ఎస్ఐఆర్పై దేశ వ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను అనేక రాజకీయ పార్టీలు వ్యక్తంచేయడం చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలనూ విన్నాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారు. బెంగాల్లో 91 లక్షలు, అంటే ఉన్న ఓట్లలో 11.9%. అలాగే తమిళనాడులో 74 లక్షలు, అంటే మొత్తం ఓట్లలో 11.6% తొలగించారు.
మమతాబెనర్జీ పోటీచేసిన భవానీపూర్లో 44,990 ఓట్లను తొలగించారు. అక్కడ ఆమె 15,105 ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీచేసిన నియోజకవర్గంలో దాదాపుగా 71,133 ఓట్లను తొలగించారు. ఆయన ఓడింది 8వేల ఓట్లతేడాతోనే. అంతేకాకుండా బెంగాల్లో తీసేసిన ఓట్లు 91లక్షలు అయితే, ఆ రాష్ట్రంలో మమత పార్టీ ఓడింది 31లక్షల తేడాతో. అదే తమిళనాడులో తీసేసింది 74లక్షల అయితే, స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతోనే. అందుకే మనమంతా ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం. అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండూ డేంజరే. ఊరికి యాభై మన ఓట్లను తీసేస్తే చాలు.. నియోజకవర్గానికి 5వేలు పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లమీద కూడా మనం దృష్టిపెట్టాలి. కుప్పంలో అది మన కళ్లెదుటే కనిపించింది. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదుసార్లో, పది సార్లో కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్లు మీద దృష్టిపెట్టాలి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా అని వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.


