పేదల సొంతింటి కలకు తూట్లు పొడుస్తారా? | YS Jagan Fires On CM Chandrababu Naidu: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కలకు తూట్లు పొడుస్తారా?

Sep 19 2025 5:44 AM | Updated on Sep 19 2025 7:27 AM

YS Jagan Fires On CM Chandrababu Naidu: Andhra pradesh

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మీకు అధికారం ఇచ్చింది పేదల సొంతింటి కలలను నాశనం చేయడానికా? 

అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? 

వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి.. మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కుంటారా? 

అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? 

మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది 

తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి 

అవసరమైతే పేదల కోసం న్యాయ పోరాటం చేస్తాం.. వారికి అండగా నిలబడతాం 

ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాలు, నిరసనలు, ఆందోళనకు సిద్ధం కావాలి

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా..? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా..? మా ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మలకు రిజి్రస్టేషన్‌ చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు..? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సిందిపోయి మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా?’ అని ప్రశ్నిం చారు.

తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్‌ చేశారు. పేదల కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని, వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ధర్నాలు, నిరసనలు, ఆందోళనకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు గారూ..  మీకు అధికారం ఇచ్చింది 
పేదలపై కత్తి కట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజి్రస్టేషన్‌ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.  

చంద్రబాబు గారూ.. మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్ర­యులుగా మిగిలిపోయారు. కానీ, మా ప్రభుత్వం వారి సొంతింటి కలను నిజం చేసేలా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించాం. ఇందులో భూమి కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చు చేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెట్‌ రేట్లతో చూస్తే రూ.1.5 లక్షల కోట్లపైమాటే.

ఇంటి పట్టా విలువే ఒక్కొక్క రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షలు–రూ.15 లక్షల వరకు ఉంది. ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్ల కాలంలో కనిపించక పోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు.  

మా ప్రభుత్వ హయాంలో మేము 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్‌ చేయించి, మొదలు పెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్‌ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతికాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. 2023 అక్టోబరు 12న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబు గారూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా?   

మా ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40 వేలు లబ్ధి కలగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15 వేలు సహాయం చేశాం. మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8 లక్షలు కాక, మొత్తంగా రూ.2.7 లక్షల లబ్ధి చేకూర్చాం. దీంతోపాటు మౌలిక సదుపాయాల కోసం మరో రూ.లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబు గారూ? 

కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం, కాలనీలు మురికి కూపాలుగా ఉండకూడదని నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, రోడ్లు తదితర వాటి కోసం దాదాపు రూ.3,555 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపు రూ.35,300 కోట్లు. ఈ 16–17 నెలల కాలంలో మీరెంత ఖర్చు చేశారు అని చంద్రబాబు గారిని సూటిగా ప్రశి్నస్తున్నాం.  

మా ప్రభుత్వ హయాంలో ‘పేదలకు ఇళ్లు’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగం లేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50 వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తెచ్చారు. అంతటితో ఆగకుండా అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి, అక్కడ ఇచ్చిన ఆ పట్టాలను రద్దు చేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని అన్యాయం చేశారు.

ఇది ద్రోహం కాదా? పేద కుటుంబాల మీద మీరు కక్ష తీర్చుకోవడం కాదా? మిగిలిన పట్టాల్లో మీరు బాధ్యతగా ఇళ్లు మంజూరు చేయించి, కట్టించాల్సింది పోయి.. అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, రిజిస్టర్‌ అయిన ఆ పట్టాలను మీకు హక్కు లేకపోయినా కూడా వెనక్కి తీసుకోవడం దుర్మార్గం కాదా? మీ స్కాముల కొరకు ఆ స్థలాల్లో ప్రైవేటు ఇండస్ట్రియల్‌ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా 
చంద్రబాబు గారూ?  

ఈ 16–17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పని తీరు సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క ఎకరం గుర్తించలేదు. ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లు మంజూరు చేయలేదు. పైగా ఇప్పుడు ఇచ్చిన వాటినే లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరో వైపు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదల కోసం అవసరమైతే దీనిపై న్యాయ పోరాటాలు చేస్తాం. వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్‌కు పిలుపునిస్తున్నా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement