
తాడేపల్లి : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఇటువంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.
కాగా, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద శుక్రవారంఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.