అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం వెల్లడి
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): విషాదంలో ఉన్న కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అనంతగిరి మండలం వాలసి పంచాయతీ జాంబవలస పరిధిలోని మూలంగుమ్మి జలపాతంలో జరిగిన దుర్ఘటనలో త్రిష, రత్నకుమారి, పవిత్ర అనే విద్యార్థినులు రెండు నెలల క్రితం దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటనను బుధవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
బాధిత కుటుంబాల దీనావస్థను తెలుసుకున్న ఆయన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన సొంత నిధుల నుంచి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. ప్రజా సమస్య లపై వైఎస్ జగన్ చూపే చొరవ, ఆయనలోని మానవీయ కోణాన్ని ఈ ఘటన మరోసారి నిరూ పించిందని బాధిత కుటుంబాలు కొనియాడాయి.


