ఇంటికి వెళ్లడానికి తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి నిరాకరణ
చేసేదిలేక బస్సులోనే ప్రయాణించిన బాలింత
మహారాణిపేట: విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో గిరిజన బాలింతకు చేదు అనుభవం ఎదురైంది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మత్స్యపురం గ్రామానికి చెందిన సుమిత్ర డెలివరీ కోసం ఈ నెల 19న కేజీహెచ్లో గైనిక్ వార్డులో చేరింది. అదే రోజు పాపకు జన్మనిచ్చింది. శనివారం డిశ్చార్జి అయ్యింది. శుక్రవారం నుంచి తమ ఇంటికి వెళ్లడానికి తల్లీ బిడ్డ వాహనం ఇవ్వాలని గిరిజన దంపతులు కేజీహెచ్లో ఆర్ఎంవోను కోరారు.
ఒక రోజు ఆస్పత్రిలో ఉంటే వాహనం ఇస్తామని వారు చెప్పారు. అయితే శనివారం ఉదయం మాత్రం తమ దగ్గర వాహన సదుపాయం లేదని చెప్పడంతో చేసేందేం లేక మండుటెండులో కేజీహెచ్ నుంచి గిరిజన దంపతులు ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లారు. అక్కడి నుంచి బస్సులో మత్స్యపురానికి రోజుల పసిబిడ్డతో బయలుదేరారు.
కాగా, తాము వాహనం ఇస్తామని చెప్పినా వారు వినకుండా వెళ్లిపోయారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. వాహనానికి సాంకేతిక సమస్య వచ్చిందని, దాని వల్ల ఒక రోజు ఉండాలని కోరామని కానీ వినలేదని ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసిఇచ్చారని చెప్పారు.


