ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు
సాక్షి, అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృషితో కదిరి–అనంతపురం–గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు (ట్రైన్ నంబర్ –06340) నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు వారంలో నాలుగు రోజుల పాటు నాగర్ కోయిల్–ఛత్రపతి టెర్మినల్ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్ కోయిల్లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా జిల్లాలోకి ప్రవేశించి కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది.