చౌకగా సౌర విద్యుత్
రివర్స్ టెండరింగ్తో తగ్గిన ధర
6,400 మెగావాట్ల టెండర్ల ఖరారు
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా చౌకగా సౌర విద్యుత్ అందబోతోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. గతంలో రూ.3 వరకు ఉన్న యూనిట్ విద్యుత్ ధర ఇకపై గరిష్టంగా 2.58కే లభించనుంది. ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా అమలు చేసేందుకు 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది.
ప్రభుత్వ పెట్టుబడి లేకుండా బిల్డ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్(బీవోటీ) విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తొలి విడతలో భాగంగా 6,400 మెగావాట్లకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. పూర్తి పారదర్శకంగా న్యాయ సమీక్ష చేపట్టిన కార్పొరేషన్.. రివర్స్ టెండరింగ్ కూడా చేపట్టి అతి తక్కువకు విద్యుత్ ఇచ్చే సంస్థలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని పది ప్రాంతాలకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థల వివరాలను గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ బుధవారం మీడియాకు విడుదల చేసింది.