నీటిలో మునిగి ఆరుగురి మృతి | Six people drowned in water | Sakshi
Sakshi News home page

నీటిలో మునిగి ఆరుగురి మృతి

Jun 9 2025 2:30 AM | Updated on Jun 9 2025 2:30 AM

Six people drowned in water

అల్లూరి, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఘటనలు  

మృతుల్లో ముగ్గురు గిరిజన విద్యార్థులు 

డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్‌(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్‌ కుమారులు గుంట సాయికిరణ్‌ (14), గుంట భానుతేజ్‌ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. 

ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్‌(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. 

అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్‌ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్‌ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్‌ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్‌తో ఆడుకుంటుండగా.. బాల్‌ పక్కనే ఉన్న నదిలో పడింది. 

బాల్‌ కోసం సయ్యద్‌ ఖాదర్‌ వలి (13), సయ్యద్‌ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. 

బాలుడిని బలిగొన్న అలలు 
విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్‌ సీ ఎదురుగా బీచ్‌లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్‌కు వచ్చింది. వీరిలో స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న సతీష్‌ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌కు వచ్చారు. 

సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్‌ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement