వివేకా హత్య కేసులో కుట్రదారులు ఆ ఇద్దరే

Shivashankar Reddy Wife Tulasamma Petition In Court For YS Vivekananda Reddy Case - Sakshi

అల్లుడు, పెద్ద బావమరిదే కుట్రపన్నారు.. న్యాయస్థానంలో శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఆయన అల్లుడైన చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితోపాటు మరో ముగ్గురు కుట్రపన్ని హత్య చేయించినట్లు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. షమీమ్‌ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో సొంత కుటుంబంలో తలెత్తిన విభేదాలు, అనుచరులతో భూ వివాదాలు, టీడీపీకి చెందిన రాజకీయ ప్రత్యర్థుల కక్షలే ఆయన హత్యకు ప్రధాన కారణమని అందులో పేర్కొన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఈమేరకు పులివెందుల న్యాయస్థానంలో ఫిబ్రవరి 21న పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా హత్య కుట్రలో ఈ అంశాలను సవివరంగా తెలియజేస్తూ తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రధానాంశాలు ఇవీ...

వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబ, రాజకీయ వారసత్వం కోసం నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఈ హత్యకు కుట్ర పన్నగా.. పులివెందులలో వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్‌ రవి అందులో భాగస్వామి అయ్యారని తులసమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భూ వివాదాలతో వివేకాపై కక్ష పెంచుకున్న ఆయన మాజీ అనుచరుడు కొమ్మా పరమేశ్వరరెడ్డి, రాజకీయంగా విభేదాలున్న వైజీ రాజేశ్వరరెడ్డితోపాటు నీరుగుట్టు ప్రసాద్‌ అందుకు సహకరించారని వెల్లడించారు. వారందరినీ నిందితులుగా చేర్చి కేసు దర్యాప్తు చేయాలని కోరారు. తన  కుటుంబ సభ్యుల పాత్ర బయటపడుతుందనే వివేకా భార్య సిట్‌ దర్యాప్తును అడ్డుకున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆ విషయాలను సీబీఐ ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తూ అమాయకులను ఇరికిస్తూ దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. 

రెండో వివాహంతో కుటుంబంలో తీవ్ర విభేదాలు
వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే హత్యకు దారి తీశాయి. షమీమ్‌ అనే మహిళను ఆయన 2010లో రెండో పెళ్లి చేసుకోగా వారికి 2015లో ఓ కుమారుడు జన్మించాడు. దీంతో ఆయన కుటుంబంలో విభేదాలు తీవ్రమయ్యాయి. వివేకా భార్య సౌభాగ్యమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. పులివెందులలో వివేకా ఒక్కరే నివసించేవారు. రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి కొంత ఆస్తి రాసివ్వాలని వివేకానందరెడ్డి భావించారు. బెంగళూరులో భూ సెటిల్‌మెంట్‌ ద్వారా వచ్చే రూ.2 కోట్లను తన రెండో భార్యకు ఇవ్వడంతోపాటు షమీమ్‌ కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడం వివేకా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రాజకీయ వారసత్వం ఆశిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డి వివేకాపై కక్ష పెంచుకున్నారు. వారిద్దరూ చాలాసార్లు షమీమ్‌ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా బెదిరించారు.

కుట్ర అల్లుడు, పెద్ద బావమరిదిదే..
వివేకా రాజకీయ, కుటుంబ వారసత్వాన్ని ఆశిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డే ఆయన హత్యకు కుట్రపన్నారు. హత్య అనంతరం వివేకా కుటుంబ సభ్యుల ప్రవర్తన సందేహాస్పదంగా ఉంది. వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డికి ఉదయం 6.27 గంటలకు వాట్సాప్‌ చేశారు. వాటిని చూస్తే హత్యకు గురైనట్లు ఎవరికైనా తెలుస్తుంది. వాటిని చూసిన తరువాత కూడా శివప్రకాశ్‌రెడ్డి ఉదయం 8 గంటలకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు కూడా వెల్లడించారు. వివేకా గుండెపోటుతో మరణించారని శివప్రకాశ్‌రెడ్డి ఎందుకు చెప్పారు? అదికూడా వైఎస్సార్‌సీపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆదినారాయణరెడ్డికి ఎందుకు చెప్పారు? మృతదేహం వద్ద వివేకా  రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను పీఏ కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని వివేకా కుమార్తె, అల్లుడికి వెంటనే తెలియజేశారు. అయితే తాము వచ్చేవరకూ ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించవద్దని రాజశేఖరరెడ్డి ఆదేశించాడు. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 1 గంటకు వివేకా కుటుంబ సభ్యులు పులివెందుల చేరుకున్న తరువాత వాటిని రాజశేఖరరెడ్డికి అప్పగించారు. అయితే  సెల్‌ఫోన్లో ఉన్న మెస్సేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్‌ చేసిన తరువాతే సాయంత్రం వాటిని పోలీసులకు అప్పగించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి గదిని తుడిచి, మృతదేహాన్ని బాత్రూమ్‌ నుంచి గదిలోకి తేవాలని తనకు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే చెప్పాడని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించారని స్పష్టమవుతోంది. 

వివేకాతో పరమేశ్వరరెడ్డికి ఆర్థిక విభేదాలు
వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయి. బెంగళూరులోని ఓ భూమి సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో తనకు దక్కాల్సిన వాటా ఇవ్వలేదని పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్‌ రవికి సన్నిహితుడిగా మారారు. వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో పులివెందులలోని నాయక్‌ ఆసుపత్రిలో చేరేందుకు ప్రయత్నించాడు. అయితే ఆరోగ్యంగా ఉన్న అతడిని చేర్చుకునేందుకు వైద్యులు సమ్మతించకపోవడంతో డా.గంగిరెడ్డి ఆసుపత్రిలో చేరేందుకు కూడా విఫలయత్నం చేశాడు. అనంతరం కడప వెళ్లి సన్‌రైజ్‌ ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేరాడు. అయితే వైద్యులు, ఇతర సిబ్బంది కళ్లుగప్పి 2019 మార్చి 14 సాయంత్రం ఆసుపత్రి నుంచి బయటకువచ్చి హరిత హోటల్‌లో సాయంత్రం 6.30 గంటలకు ఒకసారి, 7.05 గంటలకు మరోసారి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తరువాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం.

వివేకాపై కక్షగట్టిన వైజీ రాజేశ్వరరెడ్డి
కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. వైఎస్సార్‌సీపీలో క్రియాశీలంగా ఉన్నాడు. అతడి రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడు. వైఎస్‌ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో వైజీ రాజేశ్వరరెడ్డితో భేటీ అయి హత్యకు కుట్ర పన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో వివేకాతో తీవ్రంగా విభేదిస్తున్న కొమ్మా పరమేశ్వరరెడ్డిని తమ కుట్రలో భాగస్వామిగా చేసుకున్నారు. మరోవైపు కొమ్మా పరమేశ్వరరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో టచ్‌లో ఉంటూ కుట్రకు పదును పెడుతూ వచ్చారు. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, బీటెక్‌ రవి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ వివేకా  హత్యకు కుట్ర పన్నారు. పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్‌ ఆ కుట్ర అమలులో వారికి సహకరించాడు. 

పక్కాగా కుట్ర అమలు
వివేకా హత్య జరిగిన 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి 12.42 నిమిషాలకు కొమ్మా పరమేశ్వరరెడ్డి నీరుగుట్టు ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. మళ్లీ అర్ధరాత్రి దాటిన తరువాత 2.37 గంటలకు ఎర్ర గంగిరెడ్డితో ఫోన్లో మాట్లాడాడు. ఆ విధంగా వరుసగా ఫోన్లు చేస్తూ తమ కుట్ర సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించారు. తెల్లవారుజామున 4.43 గంటలకు నీరుగుట్టు ప్రసాద్‌ మరో నిందితుడు వైజీ రాజేశ్వరరెడ్డికి ఫోన్‌ చేశాడు. వేకువజామున 5.22 గంటలకు వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం నుంచి పులివెందుల బయలుదేరాడు. ఆ తరువాత అతడు వివేకా ఇంటి పరిసరాల్లో తిరిగాడు. ఆ తరువాత అతడు నీరుగట్టు ప్రసాద్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపడంతోపాటు ఉదయం 7.21 గంటలకు ఫోన్‌ చేశాడు. ఇలా వారిద్దరూ ఆ రాత్రి నుంచి తెల్లవారే వరకూ ఒకరితో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. 

తమ కుట్ర బయటపడుతుందనే..
వివేకా హత్య కేసులో పలువురి కాల్‌ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సిట్‌ బృందాలు సేకరించాయి. ఆ కేసును దాదాపు ఓ కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమైన తరుణంలో సిట్‌ దర్యాప్తును అడ్డుకుంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌ వేశారు. హత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్ర బయటపడుతుందనే ఆమె సిట్‌ దర్యాప్తును అడ్డుకున్నారు. 

కేసును తప్పుదారి పట్టిస్తున్న సీబీఐ 
సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం, ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించకపోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో అసలు నిందితులైన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్‌ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను విచారించకుండా అమాయకులను ఇరికించేందుకు యత్నిస్తోంది. కేసుకు సంబంధించి సిట్‌ బృందాలు గతంలో నమోదు చేసిన కేస్‌ డైరీలు రెండింటిని న్యాయస్థానం తెప్పించుకోవాలి.     
– సాక్షి, అమరావతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top