కరువు సీమను సస్యశ్యామలం చేస్తాం | Rayalaseema Be Greened With The Waters Of Krishna Minister Buggana | Sakshi
Sakshi News home page

కరువు సీమను సస్యశ్యామలం చేస్తాం

Jan 17 2023 4:43 PM | Updated on Jan 17 2023 4:47 PM

Rayalaseema Be Greened With The Waters Of Krishna Minister Buggana - Sakshi

డోన్‌(నంద్యాల జిల్లా): కరువు సీమను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినమైన ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు మంత్రి బుగ్గన నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్‌ మండలాల పరిధిలోని 12 చెరువులను సందర్శించి హంద్రీనీవా కాల్వ నీటితో చెరువులను నింపే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ రెడ్డి రాజశేఖర్, రాష్ట్ర మీట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీరాములు ఆధ్వర్యంలో చనుగొండ్ల గ్రామంలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల సందర్భంగా హంద్రీనీవా నీటితో డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని 68 చెరువులను నింపుతామని హామీ ఇచ్చారని, ఆ మేరకు మొదటి దశ కింద రూ.360 కోట్లతో వచ్చే జూన్‌ నాటికి సాగునీరు అందిస్తామన్నారు. క్రిష్ణగిరి మండలం పులిచెర్ల కొండపై డెలివరీ చాంబర్‌తో పాటు లక్కసాగరం వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌.. అన్ని చెరువులకు నీటిని మళ్లింపు చేసే కార్యక్రమం పైపులైన్‌ పనులు 100 శాతం పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు కాగానే చెరువులకు నీటిని మళ్లించే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఆయన మండలంలోని దేవరబండ, చనుగొండ్ల, యాపదిన్నె, మల్లెంపల్లె, వెంకటాపురం, ఉడుములపాడు, జగదుర్తి, ఎల్లారెడ్డి చెరువుల వద్ద ఆయా గ్రామ ప్రజలతో కలిసి మంత్రి బుగ్గన నీటి మళ్లింపు కార్యక్రమానికి భూమిపూజ చేశారు.  

ఖరీఫ్‌ నాటికి 10వేల ఎకరాలకు సాగునీరు  
ప్యాపిలి: వచ్చే ఖరీఫ్‌ నాటికి డోన్‌ నియోజకవర్గంలో 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మెట్టుపల్లి, ఏనుగుమర్రి, ప్యాపిలి, పెద్దపొదిళ్ల చెరువులను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రైతులనుద్దేశించి మాట్లాడారు. వర్షాధారం మీద మాత్రమే ఆధారడిన డోన్‌ నియోజకర్గం రైతులకు చెరువులు నింపే కార్యక్రమం ఓ వరం అన్నారు.  బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు తీసే అవకాశం లభిస్తుందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement