సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీలో ఆరోపణలపై ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.. అధికారులతో మంత్రులు ప్రెస్మీట్ పెట్టించారు. అయితే, నవీన్కి మొదటి ర్యాంక్పై సమాధానం దాటవేశారు. నవీన్.. సోషల్లో ఫస్ట్ ర్యాంక్, టీజీటీలో ఆరో ర్యాంక్ పొందగా.. వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. నవీన్ లాగిన్ బ్లాక్ చేసిన ప్రభుత్వం.. లాగిన్ బ్లాక్పై సమాధానం చెప్పలేదు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఈఆర్ టి కన్వీనర్ ఒక్కరినే నియమించడంపై ప్రభుత్వం సమర్థించుకుంది.
అన్ని విభాగాలు విద్యాశాఖ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయంటూ కవరింగ్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష ఎందుకు పెట్టలేదంటూ మీడియా ప్రశ్నించింది. క్వాలిఫికేషన్ లేకుండా ఎలా అర్హత కల్పించారంటూ మీడియా నిలదీయగా.. అది పాలసీ నిర్ణయం అంటూ చంద్రబాబు సర్కార్ తప్పించుకుంది. తమిళనాడులో పరీక్ష లేకుండా ఇస్తున్నారంటూ సమర్థించుకుంది. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఐదేళ్ల సమయం వాళ్లకి క్వాలిఫికేషన్ సాధించడానికి ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మళ్లీ ఎందుకు పాలసీ మార్చారంటూ మీడియా ప్రశ్నించగా.. అది ప్రభుత్వం పాలసీ అంటూ సమాధానం దాటవేశారు. అది డీఎస్సీ కోసం మారిన పాలసీ కాదు.. సాధారణంగా మార్చిన పాలసీ అంటూ అధికారులు బుకాయించారు.


