పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి | Notice Of Violation Of Assembly Rights Issued To Sakshi Media, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి

Jun 7 2025 2:24 AM | Updated on Jun 7 2025 12:03 PM

Notice of violation of assembly rights to Sakshi

‘సాక్షి’కి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు 

ఇటీవలే ఆ పత్రిక ఎడిటర్‌ నివాసంలో అక్రమంగా సోదాలు 

పలువురు ‘సాక్షి’ జర్నలిస్టులపైనా ఇప్పటికే టీడీపీ కూటమి నేతల దాడులు  

తాజాగా ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చిన ఏపీ అసెంబ్లీ 

సాక్షి, అమరావతి : రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను  మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికకు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. 

నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్‌ అండ్‌ పబ్లిషర్‌ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు.  

ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు.. 
వాస్తవానికి.. ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలేలేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృధా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. 

కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్‌ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు.  

సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు.. 
ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌. ధనంజయరెడ్డి నివాసంలో ‘సిట్‌’ పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్‌ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. 

మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 

అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్‌ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement