
రోడ్డు అడ్డంగా నిలిపిన కారును తొలగించాలన్న సీఐపై వ్యక్తి దౌర్జన్యం
కారును స్టేషన్కు తరలించాలని చూస్తే వీరంగం
ఎట్టకేలకు టూటౌన్ పీఎస్కు తరలింపు... కేసు నమోదుకు సిద్ధం
వదిలేయాలంటూ పోలీసులపై ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు
అనంతపురం ఎడ్యుకేషన్: రోడ్డుకు అడ్డంగా నిలిపిన కారును పక్కకు తీయాలని సూచించిన అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్పై కారు యజమాని దౌర్జన్యానికి దిగాడు. ‘నువ్వు సీఐ అయితే నేను భయపడాలా?’ అంటూ రెచ్చిపోయాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం సమీపంలో చోటు చేసుకుంది.
నడిరోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం
అనంతపురంలోని మారుతీనగర్కు చెందిన యాసీన్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కారులో వెళుతూ సుభాష్ రోడ్డులో రోడ్డుపై ఆపేశాడు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే సమయంలో ట్రాఫిక్ సీఐ వెంకటేష్నాయక్ అక్కడకు వెళ్లి డ్రైవింగ్ సీటులో కూర్చొన్న యాసీన్కు కారును పక్కకు తీయాలని సూచించాడు. నిబంధనలకు వ్యతిరేకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ వాహనాన్ని నిలపడంతో కౌన్సెలింగ్ ఇస్తూ లైసెన్స్ గురించి ఆరా తీశారు. తన వద్ద లేదని, ఇంట్లో ఉందని, మొబైల్లో పెట్టించుకుంటానంటూ యాసిన్ బదులిచ్చాడు.
లైసెన్స్ చూపించమంటే రుబాబు
ఎంత సేపటికీ లైసెన్స్ను యాసిన్ చూపించకపోవడంతో సీఐ గట్టిగా నిలదీశారు. దీంతో యాసీన్ రెచ్చిపోయాడు. సీఐపై తిరబడ్డాడు. లైసెన్స్ చూపించేది లేదు. ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ మాటలతో రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కల్పించుకుని సదరు కారును పోలీస్స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా వారితో దురుసుగా వ్యవహరించాడు. చివరకు పోలీస్ క్రేన్ వాహనాన్ని తెప్పించి కారును తరలించే ప్రయత్నం చేయడంతో మరో వ్యక్తి కల్పించుకుని తానే తీసుకొస్తానంటూ కారును స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. ఇంతలో సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని యాసిన్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
రాజకీయ ఒత్తిళ్లు..
నడిరోడ్డుపై జరిగిన వాగ్వాదం, కారును స్టేషన్కు తరలించిన విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇంతలో సమాచారం అందుకున్న అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఎలాంటి కేసు నమోదు చేయొద్దని, సదరు వ్యక్తిని వదిలేయాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేసినట్లు సమాచారం. కాగా, ప్రజలందరూ చూస్తుండగా సామాన్య వ్యక్తి సాగించిన దౌర్జన్యాన్ని తీవ్ర అవమానంగా భావించిన పోలీసులు ఆ ప్రజాప్రతినిధి మాటలను పట్టించుకోకుండా కేసు నమోదుకే మొగ్గు చూపారు. ఇదే అంశంపై రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రాఫిక్లో ఇబ్బందులకు గురి చేసిన యాసిన్కు నోటీసు ఇచ్చి పంపాం. తర్వాత కేసు నమోదు చేస్తాం’ అని తెలిపారు.