పాస్టర్‌ ప్రవీణ్‌ కేసులో లోతైన దర్యాప్తు: సీఐడీ ఎస్పీ

Indepth Investigation Into The Case Of Pastor Praveen: CID SP - Sakshi

సాక్షి, అమరావతి/గుంటూరు: పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి కేసులో లోతైన దర్యాప్తు జరుగుతున్నదని, ఈ కేసుకు సంబంధించి సోషల్‌ మీడియాలోనూ, మీడియాలోనూ ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని ఏపీ సీఐడీ ఎస్పీ జీఆర్‌ రాధిక స్పష్టం చేశారు.  కేసు వివరాలను ఆమె గురువారం ఓ ప్రకటనలో వివరించా రు. పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి వీడియోను చూసిన గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ ఈ ఏడాది జనవరి 12న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ‘హిందూ దేవుళ్ల విగ్రహాలు ఫేక్‌ అని, తాను ఎన్నో విగ్రహాలను అవమానించానని, అనేక  గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానంటూ’   పాస్టర్‌ ప్రవీ ణ్‌ చక్రవర్తి అన్న వ్యాఖ్యలు ఉన్న సీడీని  ఫిర్యాదుకు జత చేశారు.

దీనిపై మం గళగిరి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 1/2021 సెక్షన్‌ 153/ఎ, 153 బి(1)(సి), 505(1)(సి), 505(2), 295(ఎ), 124(ఎ), 115 రెడ్‌ విత్‌ 66 తీవ్రమెన సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీఐడీ బృందం పాస్టర్‌ ప్రవీణ్‌ను జనవరి 13న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించడంతో అదే రోజు అర్ధరాత్రి జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత విచారణ కోసం ప్రవీణ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడంతో జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు అనుమతించింది.  ప్రస్తుతం ప్రవీణ్‌ను గుంటూరులోని సీఐడీ రీజినల్‌ కార్యాలయంలో విచారిస్తున్నారు. జనవరి 23తో అతని కస్టడీ ముగుస్తుంది. కాగా, ప్రజలను రెచ్చగొట్టేలా, మతాలను కించపరిచేలా మీడియాలో కథనాలు ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ రాధిక హెచ్చరించారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top