ఏపీలో స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహం | A huge boost for startups in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహం

May 16 2023 3:48 AM | Updated on May 16 2023 10:30 AM

A huge boost for startups in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్టార్టప్‌లకు భారీ ప్రో­త్సా­­­హానికి కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్‌లన్నింటికీ ఒకే చోట అన్ని పరిష్కారాలు లభించేలా ఏపీ స్టార్టప్‌ డాట్‌ ఇన్‌ పేరుతో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను సమకూర్చేవిధంగా ఇన్నొవేషన్‌ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే టాప్‌ ఫండింగ్‌ కంపెనీల్లో ఒకటైన సక్సీడ్‌ ఇండోవేషన్‌ ఫండ్‌ రాష్ట్రంలోని స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది.

ఇందులో భాగంగా తొలి దశలో ఏడు స్టార్టప్‌లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మరో రెండు దశల తర్వాత ఎంపికైన సంస్థలకు  ఫండింగ్‌ మొదలవుతుందని ఐటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఐటాప్‌) చైర్మన్‌ శ్రీధర్‌ కోసరాజు ‘సాక్షి’­కి తెలిపారు. ఏపీ స్టార్టప్స్, డీప్‌టెక్‌ ఇండియాలు సక్సీడ్‌ ఇండోవేషన్‌ ఫండ్‌ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

గుజరాత్‌ రాష్ట్రంలో సుమారు రూ.­1,000 కోట్లతో ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఏర్పా­టు చేసి­న విధంగానే రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌ స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. గుజరాత్‌ తరహాలోనే ప్రారంభంలో రూ.100 కోట్లతో స్టార్టప్‌ ఫండ్‌ స్టార్ట్‌ చేస్తే దానికి కేంద్రం నుంచి కూడా అంతేమొత్తం అందించేలా తోడ్పాటును అందిస్తానని చె­ప్పా­రన్నా­రు. దీంతో ఏపీ స్టార్టప్‌ పేరు­తో ఏర్పా­టు చేస్తున్న ఈ ఫండింగ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సక్సీడ్‌ ఇండోవేషన్‌ ఫండ్‌ ముందు­కు వచ్చిందన్నారు.

ఆ సంస్థ భాగ­స్వా­ము­లు రమేష్‌ లోగనాథం, విక్రాంత్‌ వర్షి­ణి విశాఖలోని 40 మందికిపైగా హై­నెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లతో చర్చ­లు జరిపినట్లు తెలిపారు. ఎంపికైన స్టార్టప్‌కు రూ.50 లక్షల నుంచి రూ. 8 కోట్ల వ­రకు సక్సీడ్‌ సమకూరుస్తుందన్నారు. ప్రారంభంలో రూ.200 కోట్లతో నిధి ఏ­ర్పాటు చేసి,  అనంతరం రూ.1,000 కో­ట్ల­కు చేర్చి స్టార్టప్‌ హబ్‌గా ఏపీని తీర్చి­దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement