
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీస్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోంది. జగన్ విలువలు విశ్వసనీయత కలిగిన వ్యక్తి. ప్రజల కోసం పరితపించే వ్యక్తి. కానీ, ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయటం కొన్ని పార్టీలకు అలవాటుగా మారింది. ఈవీఎంలతో మోసం చేసి గెలుపు సాధించారు. గత ఎన్నికల్లో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో ఎవరూ సమాధానం చెప్పటం లేదు.
జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో వ్యవస్థలను నిర్వీర్యం చేసారు. ఎన్నికల్లో జగన్ సంయమనంతో వ్యవహరించారు. ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించింది. సీసీ పుటేజీ, వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎందుకు భయపడతారు.?. వీటన్నిటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.
వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం ఏం అవుతుంది?. తటస్థంగా ఉండేవారు ఎవరైనా ఆ 15 గ్రామాలకు వెళ్లి విచారణ జరపాలి. ఓట్లు వేస్తే వాళ్ల చేతి వేళ్లకు చుక్కలు ఉన్నాయో లేదో చూడాలి. దాన్ని బట్టే పోలింగ్ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు స్వేచ్చ, స్వాతంత్ర్యం నిలపడాలని కోరుకునే వారు ఎవరైనా రావొచ్చు.
పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు. ఎన్నికలు శాంతి యుతంగా జరగాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మేము కూడా వారితో గొడవపడి ఉంటే ఎన్నికలు ఫలితం ఎలా ఉండేదో?. కానీ ప్రజల ప్రాణాలకు ప్రమాదం రాకూడదని భావించాం.

పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించారు. పదిహేను పోలింగ్ బూతులకు రెండు వేల మంది పోలీసులను పెట్టారు. జడ్పీటీసీ ఎన్నికల అక్రమాలపై మా పోరాటం కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థ రక్షిస్తుందని జగన్ నమ్ముతున్నారు. ఎవరు వచ్చినా మేము అక్కడ జరిగిన విషయాలను చూపిస్తాం. మన ప్రజా స్వామ్యాన్ని మనం రక్షించుకుందాం అని అన్నారు.