మెగా డీఎస్సీ స్కామ్‌పై జెన్‌జీ వార్‌! | Gen Z war over mega DSC scam | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ స్కామ్‌పై జెన్‌జీ వార్‌!

Jul 30 2026 4:27 AM | Updated on Jul 30 2026 4:27 AM

Gen Z war over mega DSC scam

ఢిల్లీ తరహాలో పోరాడేందుకు నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత సన్నద్ధం

ప్రభుత్వం దిగిరాకుంటే ఈనెల 31 నుంచి ఉద్యమ కార్యాచరణకు పిలుపు

విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలతో సహా చెల్లించాల్సిందే

నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి ఇవ్వాలని డిమాండ్‌

డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే

మంత్రి నారా లోకేశ్‌ తక్షణం రాజీనామా చేయాలి

నోటిఫికేషన్‌ నుంచి నియామకాల దాకా అన్నీ అక్రమాలే

డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి అధికారాల కేంద్రీకరణతో స్కామ్‌కు నాంది

రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేతుల్లో.. పరీక్షల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికే టాప్‌ ర్యాంకులు

టీడీపీ నేతల చేతుల్లో ఉన్న క్రీడాసంఘాల నుంచి సర్టిఫికెట్లు

ఇష్టారాజ్యంగా జీవోలు మార్చి స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు

ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు

సాక్షి, అమరావతి: ‘నీట్‌’ పేపర్‌ లీకేజీపై ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జెన్‌జీ యువతరం ఉవ్వెత్తున ఉద్యమించిన రీతిలోనే.. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలపై బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబు సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమైంది. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను అక్రమాలు, అవినీతిమయంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వెల్లువెత్తుతోంది. డీఎస్సీలో అక్రమాలను ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా స్పందించకుండా లోకేశ్‌ ఇంకా సవాళ్లు విసరడం సిగ్గు చేటని బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. 

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్లతో ఈనెల 31 నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు ఎన్నో ఉదంతాలున్నాయని గుర్తు చేస్తున్నారు.   

మెగా డీఎస్సీలో అక్రమాల పర్వం.. 
మెగా డీఎస్సీ 2025 ప్రక్రియ మొదలు పెట్టగానే అంతకు ముందు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో నియమితుడైన కన్వీనర్‌ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి అధికారాలను కేంద్రీకరించారు. ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్‌నే పరీక్షలు నిర్వహించే డీఎస్సీ కన్వీనర్‌గా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త సంతకాలతో, కొత్త తేదీలతో మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను, అప్‌ లోడింగ్‌ను, డిజిటలైజేషన్‌ను పూర్తిగా ఎస్సీఈఆర్టీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అప్పగించారు. ఇందులో ఒకడైన నవీన్‌ జిల్లా టాపర్‌గా వచ్చాడు. అతడి నియామకాన్ని రద్దు చేసి ఆ తర్వాత రెండో మెరిట్‌ లిస్ట్‌ ఇచ్చారు.  

మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు పెట్టలేదు? 
డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను భ్రష్టు పట్టించడానికి లోకేశ్‌ విద్యాశాఖను వాడుకున్నారని అభ్యర్థులు పే­ర్కొంటున్నారు. కలెక్టరేట్‌లో ప్రదర్శించాల్సిన మెరి­ట్‌లిస్ట్‌ ఎందుకు పెట్టలేదు? టాప్‌ ర్యాంకర్‌గా వచ్చి­న నవీన్‌ను తీసేసి రెండో లిస్ట్‌ ఎందుకు విడుదల చేశారు? మెరిట్‌ లిస్ట్‌ నుంచి నవీన్‌ను ఎందుకు తీసేశారో కోర్టుకు కూడా చెప్పకుండా వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు.  

స్పోర్ట్స్‌ కోటాలో దొడ్డి దారిన అమ్మేశారు.. 
స్పోర్ట్స్‌ కోటా కోసం జీవో 74 ఉండేది. అప్పుడు 2 శాతం కోటాలో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆటల్లో నైపుణ్యంతో పాటు టెట్, డీఎస్సీ క్వాలిఫై కావాలి. లోకేశ్‌ మంత్రి కాక ముందు ఈ నిబంధన ఉండేది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే రోజే అంటే 2025 ఏప్రిల్‌ 19న ప్రకటన చేయటానికి గంట ముందు స్పోర్ట్స్‌ కోటా కొత్త జీవో 4 ఇచ్చారు. అదే సమయంలో జీఏడీ జీవో 47 ఇచ్చింది. అందరితోపాటు సమానంగా విద్యార్హతలు అక్కర్లేదు, టెట్, డీఎస్సీ­లు రాయాల్సిన పని లేదని పేర్కొంది. మెగా డీఎస్సీ పూర్తయ్యాక స్పోర్ట్స్‌ కోటాలో మళ్లీ మా­ర్పు­లు చేస్తూ జీవో 56 జారీ చేశారు. దొడ్డి దారిన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని, 26 రోజుల్లోనే జీవోలు ఇచ్చి, మళ్లీ జీవోలు మార్చేశారు. జాతీయ స్థాయి గోల్డ్‌ మెడల్‌ వచ్చిన దుర్గయ్యకు ఇవ్వకుండా, రాష్ట్ర­స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగం ఇచ్చేశారు.  

అడ్డగోలుగా సర్టిఫికెట్లు.. వాటితో ఉద్యోగాలు  
కూన రవికుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ ద్వారా 38 మంది టీచర్‌ ఉద్యోగా­లకు ఎంపికయ్యారు. లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ అధ్యక్షుడిగా ఉన్న జూడో సంఘం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి, బేరసారాల్లో దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నారు. ఆధారాల్లో ఫోన్‌ నంబర్‌ కనిపిస్తున్నా.. ఎఫ్‌ఐఆర్‌లో అనుమానితుడని చెప్పి తప్పించేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో లోకేశ్‌ తేల్చాలి. ఎవరూ లేకపోతే పో­లీసులు ఎందుకు దీనిపై విచారణ జరపడం లేదు? 

సీబీఐ విచారణ జరగాల్సిందే: పేర్ని నాని
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్‌ చేశారు.  బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేశ్‌ మెగా డీఎస్సీలో అవకతవకలపై సమాధానం చెప్పకుండా వైఎస్‌ జగన్‌ ఇంటి గేటు బయట నిలబడ్డా! పిలిచాను! ఆయన రాలేదు! అని సొల్లు కబుర్లు చెప్ప­డం ఎందుకని ప్రశ్నించారు. మంగళగిరిలోనో, పునాదిపాడులోనో దాతలు ఇచ్చి­న డబ్బులతో స్కూల్‌ కడితే విద్యాశాఖను మార్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. ‘రమ్మీ, పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వీటిపై ప్రశ్నిస్తే శ్రీకాకుళం జిల్లాలో నాపై కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజు వస్తుంది’ అని పేర్కొన్నారు.

ఈ ప్రశ్నలకు బదులేది..?
1. ప్రశ్నపత్రాల తయారీతోపాటు పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించడం పారదర్శకతకు పాతర కాదా?

2. ప్రశ్నల తయారీ, అప్‌లోడింగ్, డిజిటల్‌ నిర్వహణ లాంటి అత్యంత గోప్యమైన పనులను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అప్పగించడం పేపర్‌ లీకేజీకి పునాది కాదా?

3. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పురమ నవీన్‌ సోషల్‌ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్‌ 2లో ఆరో ర్యాంకర్‌గా నిలిచాడు. ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికే టాప్‌ ర్యాంకులు రావడం పేపర్‌ లీకేజీని నిర్ధారిస్తోంది. ఆ తర్వాత నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా మెరిట్‌ లిస్టు నుంచి పేరు తొలగించారు. డేటాను మాయం చేసి కాల్‌లెటర్‌ కూడా పంపలేదు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. డిజిటల్‌ యాక్సెస్‌ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన పేపర్‌తో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బు చేతులు మారింది? వీటిపై విచారణ ఏది?

4. జీవో నంబర్‌ 74 ప్రకారం స్పోర్ట్స్‌ కోటా 2 శాతంగా ఉండేది. ఇతర అభ్యర్థులతో సమానంగా అన్ని అర్హతలు కలిగి, సంబంధిత పోస్టుకు పరీక్ష రాయడం తప్పనిసరి. కానీ డీఎస్సీ 2025లో జీవో నంబర్లు 4, 47 ద్వారా స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు పరీక్షను ఎత్తివేశారు. కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచారు. స్పోర్ట్స్‌ కోటా పోస్టులు భర్తీ చేయగానే జీవో నంబర్లు 4, 47ను రద్దు చేసి, పోటీ పరీక్షను మళ్లీ తప్పనిసరి చేస్తూ జీవో నంబర్‌ 56 జారీ చేశారు.

మొదట ఇచ్చిన జీవోలు సరైనవే అని అనుకున్నప్పుడు మళ్లీ వాటిని రద్దుచేస్తూ జీవోలు ఎందుకు తెచ్చారు? అంటే.. తమవారితో పోస్టులు నింపడానికి గేట్లు తెరిచి, పని పూర్తికాగానే మళ్లీ మూసేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి.. ఇంటర్‌ కాలేజీ, ఇంటర్‌ యూనివర్సిటీ, ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్‌ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. కొన్ని క్రీడా సంఘాల నుంచి అసాధారణ సంఖ్యలో సర్టిఫికెట్లు చూపించి నియామకాలు చేపట్టారు. 

5. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. జూడో అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు, లోకేశ్‌ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్‌ జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్‌బాల్‌ నుంచి 38 మందికి స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. క్రీడా సంఘాలకు నాయకత్వం వహించేది అధికార పార్టీ నేతలే. సర్టిఫికెట్లు ఇచ్చేదీ వారే. ఇక పారదర్శకత ఎక్కడుంది?

6. ఆర్చరీలో జాతీయ స్థాయి గోల్డ్‌ మెడలిస్ట్‌ దుర్గయ్యను 1 : 1 పద్ధతిలో పిలిచి, సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు. మరోవైపు జిల్లా, యూనివర్సిటీ స్థాయిలో కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన క్రీడాకారుడిని పక్కనపెట్టారు.

7. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లోగోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. అభ్యర్థితో ఉద్యోగం కోసం బేరసారాలు జరిపారు. వీడియోలో ఫోన్‌ నంబర్‌ స్పష్టంగా కనిపించినా ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేయకుండా ‘అనుమానిత వ్యక్తి’గా మాత్రమే పేర్కొన్నారు. బలమైన సెక్షన్లు పెట్టకుండా నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌పై వదిలేశారు. ఇది కుంభకోణం వెనుక పెద్దల ప్రమేయానికి రుజువు కాదా? 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement