విజయవాడలో ధర్నా చేస్తున్న సీహెచ్వోలు (ఫైల్)
రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ హాజరు నిబంధనతో వేధిస్తున్న ప్రభుత్వం
విధుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపునకు కదం తొక్కనున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ, తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లు సోమవారం విజయవాడలో రాష్ట్రస్థాయి మహా ధర్నాకు దిగబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వారంతా పలుమార్లు నిరసనలు తెలిపారు. గతేడాది ఏకంగా 40 రోజుల పాటు విధులు బహిష్కరించి సమ్మె కూడా చేశారు.
అయినా తీరు మార్చుకోని ప్రభుత్వం.. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్వోలను రాత్రి 8 గంటలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరు వేయాలంటూ వేధిస్తోంది. వారికి ఇవ్వాల్సిన నెలవారీ ఇన్సెంటివ్ రూ.5 వేలకు.. రాత్రి 8 గంటల హాజరుతో ముడిపెట్టింది. దీనిపై సీహెచ్వోలు గత కొన్నిరోజులుగా ఆందోళన తెలియజేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల్లో కూడా రాత్రి 8 గంటలకు హాజరు వంటి ప్రస్తావనే లేదని వారు మండిపడుతున్నారు. తమ పని సమయాన్ని, విధులను వెంటనే క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమైన డిమాండ్లు..
⇒ అసాధారణమైన పనిభారం నుంచి విముక్తి కల్పించాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న న్యూ మేట్రిక్స్ విధానాన్ని రద్దు చేసి.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నెలవారీ రూ.15 వేల ఇన్సెంటివ్ విధానం అమలు చేయాలి.
⇒ అద్దె భవనాల్లో ఉన్న విలేజ్ క్లినిక్స్కు మూడు నెలల అద్దె అడ్వాన్స్ చెల్లించాలి.
⇒ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్వోల సర్వీస్ను క్రమబద్ధీకరించాలి. పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి.
⇒ గతేడాది చేపట్టిన 40 రోజుల సమ్మె కాలాన్ని పనిదినాలుగా పరిగణించి.. వేతనాలు, ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేయాలి.
⇒ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వెయిటింగ్ హాల్, టెలిమెడిసిన్, డే కేర్ రూమ్స్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి.


