ఉద్యోగులపై అంతులేని నిర్లక్ష్యం | Chandrababu Govt Endless neglect of employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై అంతులేని నిర్లక్ష్యం

Apr 20 2026 5:16 AM | Updated on Apr 20 2026 5:16 AM

Chandrababu Govt Endless neglect of employees

వారి సమస్యలు పరిష్కరించమంటే నన్ను తీసేస్తామంటున్నారు..

మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదు

రెండేళ్లయినా ఉద్యోగులకిచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదు

ఇంతలా మోసంచేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు

ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు సర్కారు సరికొత్త పద్ధతులు

మళ్లీ జగన్‌ సీఎం అయితేనే ఉద్యోగుల సమస్యలకు మోక్షం

మేలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తాం

ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వో­ద్యోగులపై చంద్రబాబు ప్రభు­త్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శి­స్తోందని.. వారిని ఇంతలా పట్టించు­కోని ప్రభు­త్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్ర­ప్రదేశ్‌ గవర్న­మెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల మ్యాని­ఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ­లను నెరవేర్చమంటే సీఎం చంద్రబాబు తన­ను ఉద్యోగం నుంచి తీసేస్తా­మని బెదిరి­స్తున్నా­రని.. ఇలాంటి తాటా­కు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలే­దని ఆయన స్పష్టంచేశారు. తాడే­పల్లి­­లో ఆదివా­రం ఆయన మీడి­యా­తో మాట్లా­డుతూ.. ఉద్యోగుల మేలు కోసం తాను ఎందాకైనా వెళ్తానన్నారు. అందుకే మేలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతు­న్నట్లు  ఆయన ప్రకటించారు. వెంకటరామిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..

రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేరలేదు..
వైఎస్‌ జగన్‌ పాలన ఉద్యోగులకు స్వర్ణయుగం లాంటిది. మళ్లీ జగన్‌ సీఎం అయితేనే ఉద్యోగుల సమస్యల పరిష్కారమవుతాయి. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్‌ బకాయిలు క్లియర్‌ వంటి చాలా హామీలిచ్చారు. ఇప్పటికే రెండేళ్లయినా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఐఆర్‌ ఊసేలేదు. పీఆర్సీ అమలుచేయాల్సిన టైం దాటిపోయి మూడేళ్లయినా ఇంతవరకు పీఆర్సీ కమీషన్‌ను ఏర్పాటుచేయలేదు. ఇప్పటివరకు నాలుగు డీఏలు పెండింగ్‌ ఉన్నాయి. బాకాయిలు రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. పెన్షనర్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తాం, సీపీఎస్‌ ఉద్యోగులకు జీపీఎస్‌ కంటే మెరుగైన పింఛన్‌ విధానం అన్నారు.. అదీలేదు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అన్నారు, అవీలేవు. ఆశ వర్కర్లకు జీతాలు పెంచి, గ్రాట్యుటీ ఇస్తామన్నారు.. అదీలేదు. ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వంద రేట్లు మేలు.

ఉద్యోగులపై పనిభారం..
ఇలాంటి ప్రభుత్వం కరోనా కాలంలో ఉండి ఉంటే రాజధాని కోసం, హూదూద్, కేరళ తుపాను బాధితుల కోసం ఉద్యోగుల నుంచి వసూలుచేసినట్లుగా కరోనా పేరుతో కూడా చంద్రబాబు డబ్బులు వసూలుచేసేవారు. ఉద్యోగుల పక్షాన గత ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు నాటి ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉద్యోగులకు ఏం మేలు చేశారు? గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది.. వేలాది మంది టీచర్లకు ప్రమోషన్లు, మండలానికి ఒక ఎంఈఓ పోస్టు క్రియేట్‌ చేసి టీచర్లకు పదోన్నతులిచ్చింది.. గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చి లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చింది.. ఆశ వర్కర్లకు జీతాలు పెంచింది.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసింది.. ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చింది.. అందుకే ఇప్పుడు ప్రతీ ఉద్యోగి రోడ్డుపైకొచ్చి ఆందోళన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్‌టీఏ కూడా ఆందోళనకు సిద్ధమైంది. ఉద్యోగులను ఇంతగా నిర్లక్ష్యం చేయటం చంద్రబాబుకు మంచిది కాదు. ఉద్యోగులకు యాప్‌లు తగ్గిస్తామని చెప్పి పనిభారం పెంచారు. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. పైపెచ్చు సచివాలయంలో వారు ఉండటంలేదని నిందిస్తున్నారు. ఉద్యోగులను వేధించేందుకు ఈ ప్రభుత్వం కొత్తకొత్త పద్ధతులు అవలంబిస్తోంది.

ఉద్యోగులు విసిగిపోయారు..
ఇక గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో మూడునెలలకు ఒక మీటింగ్‌ పెట్టేది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రుల కమిటీ సభ్యులు వీరికి అందుబాటులో ఉండేవారు. ఈ ప్రభుత్వంలో అలా ఎవ్వరూ లేరు. అందుకే ఉద్యోగులంతా విసిగిపోయారు. సంక్రాంతి డీఏ బకాయిలు అందరికీ పడకపోయినా ఎల్లో మీడియా ఇచ్చేసినట్లు రాసేసింది. వచ్చేనెలలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తాం.  ప్రభుత్వం దిగొచ్చే వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement