సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శ తర్వాతే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగంలో కదలిక రావడం గమనార్హం.
గురువారం రాత్రి 11గం. సమయంలో బాధితుడి తల్లికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.
ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ను విచారణ అధికారిగా నియమించినట్లు విజయలక్ష్మితో సీపీ రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లడంతోనే ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వం.. ఆగమేఘాల మీద పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు చర్చ నడుస్తోంది.

ఇదీ చదవండి: సీఐ నాగరాజు.. మాములోడు కాదు!


