సాక్షి, తిరుపతి: కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక అపచారాలు పరాకాష్టకు చేరుకున్నాయి. 300 రూపాయల టికెట్ను మూడు వేలకు అమ్ముకుంటున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారు అంటూ మండిపడ్డారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమలను ప్రళాక్షన చేస్తాం అనేవి కూటమి నేతల మాయమాటలు మాత్రమే. తాపేదారులతో అడ్డూ అదుపు లేకుండా అపచారాలు చేస్తున్నారు. 2008లో నేను పాలకమండలి అధ్యక్షునిగా ఉన్న సమయంలో బాలమురళి కృష్ణను ఆస్థాన విద్వాంసుడిగా నియమించాం. ఆయన చేత ఆలయం ముందు సంగీత కార్యక్రమం నిర్వహించాం. ఇది శాశ్వతంగా ఉండాలని నాదనీరాజన ప్రాంగణం వెలసింది. ఆ వేదికలో సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా కార్యక్రమం జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆ వేదికపై అవినీతి కంపు కొడుతోంది. దీని కోసం భాస్కర్ అనే అధికారిని నియమించారు. ఆయనకు అర్హత అసలు లేదు. సీఎం, చైర్మన్ అండదండలతో భాస్కర్ పేట్రేగి పోతున్నారు.
ప్రోగ్రాం ఇచ్చేందుకే కమీషన్లు, పారితోషికంలో కమీషన్లు తీసుకుంటున్నారు. వీఐపీ, బ్రేక్, 300 రూపాయల దర్శనం టికెట్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. 300 టికెట్లను మూడు వేలకు అమ్మేస్తున్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారు. శ్రీవాణి టికెట్లను 15 వేలకు అమ్మేస్తున్నారు. ఎస్వీబీసీలో అనర్హులకు పదవి ఇచ్చి నాశనం చేశారు. రూ.50 కోట్లతో ఎస్వీబీసీని స్వయం ప్రతిపత్తి సంస్థగా తీర్చి దిద్దే ప్రయత్నం వైఎస్సార్సీపీ హయాంలో జరిగింది. కరోనా సమయంలో ఎస్వీబీసీ ద్వారా ప్రేరణ పొందేలా చేశాం, ధైర్యం పెంచాం. ఈ కూటమి ప్రభుత్వం కుప్ప విశ్వనాథ శర్మను ఎస్వీబీసీ నుంచి పంపేశారు. చతుర్వేద యాగాలు పూర్తిగా నిలిపివేశారు. 700 మంది వేద పారాయణదారుల నియామకం కాలేదు. కన్వీనర్ కోట్ల రూపాయలు అభ్యర్థుల వద్ద నుంచి కాజేసినా చర్యలు లేవు.

నృత్య, సంగీత కళాశాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అర్హత లేని వ్యక్తిని హిందూ ధర్మ ప్రచార పరిషత్కు నియమించారు. ఆన్లైన్ పెట్టిన అనంతరం 800 టికెట్లు ఎలా పూర్తి అవుతాయి. ఒక్కో టికెట్ కొట్టడానికి ఎంత సమయం పడుతుంది. కొండపై బ్రోకర్లు ఉన్నారు. రూ.15 వేలు ఇస్తే టికెట్లను బ్రోకర్లు అమ్మేస్తున్నారు. 400 నుంచి 600 టికెట్లు అమ్మేస్తున్నారు. రోజుకు శ్రీవాణి టికెట్ల ముసుగులో 15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడుతున్నారు అంటూ ఆరోపించారు.


