సినీ పరిశ్రమకు ప్రభుత్వ రాయితీలు

AP Government subsidies to the film industry - Sakshi

గతేడాది 3 నెలల విద్యుత్‌ స్థిర చార్జీల రద్దు

మరో 6 నెలల స్థిర చార్జీల చెల్లింపులకు వాయిదాలు

థియేటర్లు తీసుకున్న రుణాలకు 50 శాతం వడ్డీ రాయితీ 

సాక్షి, అమరావతి: కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు 2020 ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు విద్యుత్‌ స్థిర చార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 6 నెలలకు (2020 జులై నుంచి డిసెంబర్‌ వరకు) విద్యుత్‌ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని పేర్కొంది. వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ఫ్లెక్స్‌ థియేటర్లకు లేదని తెలిపింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ధి కలిగేలా ఈ రాయితీలిచ్చినట్లు సమాచార, పౌర సంబంధాల ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి టి.విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top