
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం పడే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది.