
సాక్షి, అమరావతి: ఈ నెల 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలను బడ్జెట్ ప్రసంగం తర్వాత వాయిదా వేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ పాల్గొని పది రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఒకపూటే సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు, పలు అంశాలపై చర్చలు ఉన్నప్పుడు సాయంత్రం వరకూ సభ నిర్వహిద్దామని స్పీకర్ చెప్పారు. మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మంగళవారం చీఫ్ విప్, విప్లను ఖరారు చేస్తామని సీఎం చెప్పారు.
బీఏసీలోనూ జగన్ జపమే
బీఏసీ సమావేశంలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్ గురించే ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారనే దానిపై సీఎం, స్పీకర్ పలు విమర్శలు చేసినట్లు సమాచారం