ఆ ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు
● రాసిన పరీక్షనే మళ్లీ రాయించడంపై ఎస్కేయూ వీసీ ఆగ్రహం
● 9 మంది విద్యార్థులకు
నేడు అదే కేంద్రంలో పరీక్ష
అనంతపురం: రాసిన పరీక్షనే విద్యార్థులతో మళ్లీ రాయించిన ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం నగరంలోని శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరీక్షను మంగళవారం మళ్లీ నిర్వహించారు. తప్పును గుర్తించిన ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు 15 నిమిషాల అనంతరం ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రశ్నపత్రాన్ని మెయిల్ ద్వారా పంపినా సదరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆదినారాయణ రెడ్డి నిర్లక్ష్యం వహించారు. బలవంతంగా 9 మంది విద్యార్థులతో పరీక్ష రాయించారు. విద్యార్థులు బతిమలాడినా కనికరించలేదు. ఈ అంశంపై ‘సాక్షి’లో గురువారం కథనం వెలువడడంతో ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ స్పందించారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఆయా విద్యార్థులకు శుక్రవారం అదే కేంద్రంలో మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్షల విభాగం అధికారులపై చర్యలేవీ..?
షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన ప్రశ్నపత్రాన్ని ఆయా కళాశాలలకు పంపాల్సిన బాధ్యత ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులపై ఉంటుంది. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక సబ్జెక్టుకు బదులు మరొక సబ్జెక్టు ప్రశ్నపత్రం పంపి వర్సిటీ ప్రతిష్టను మసకబార్చారు. దీనిపై ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు చేసిన తప్పును తేలికగా తీసుకుని, కేవలం ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వారం తర్వాత అతడిని విధుల్లోకి తీసుకున్నా ఎవరూ ప్రశ్నించలేరు. కానీ, ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే చర్చనీయాంశంగా మారింది.
ఖాళీల భర్తీకి చర్యలు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా టీచర్ల ఖాళీల భర్తీకి తొలి అడుగు వేసింది. ఈ నెలాఖరులోగా ఎంటీఎస్ టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి చేసి, అనంతరం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్షారియా ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా ఎంటీఎస్ టీచర్లకే అవకాశం
గురువారం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలను ముందుగా గుర్తించి, వాటికి ఎంటీఎస్ టీచర్ల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించడం ద్వారా విద్యార్థులకు బోధనలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. బదిలీలు, సర్దుబాట్ల తర్వాత కూడా ఉపాధ్యాయుల కొరత కొనసాగితే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 550 మంది..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1998, 2008 డీఎస్సీ ద్వారా నియమితులైన ఎంటీఎస్ టీచర్లు 665 మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం సుమారు 100 మంది పదవీ విరమణ చేశారు. 550 మంది ఎంటీఎస్ టీచర్లు వివిధ పాఠశాలల్లో సేవలందిస్తున్నారు.


