ఆనందకర జీవితం
తాడిపత్రి టౌన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తాడిపత్రి పట్టణంలోని పురాతన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులతో పాటు విద్యార్థులు హాజరై యోగాసనాలు వేశారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ యోగాతోనే ఆనందకర జీవితం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన అవసరమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికారి ఓబుళమ్మ, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లారీని ఢీకొన్న
ఆర్టీసీ బస్సు
● 17 మందికి గాయాలు
గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లిలో గురువారం లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులు తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు 45 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి ధర్మవరానికి బయలుదేరింది. మార్గమధ్యంలో బసినేపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ను లారీ దాటుతుండగా, వెనుక నుంచి ఢీకొంది. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలకు చెందిన కవిత, ఐజకు చెందిన జయమ్మ, గోపాల్, ఫిలిప్, కీర్తన, కవిత, అశ్విని, అంకిత, సింధుజా, అనంతపురం నగరానికి చెందిన ఇమామ్బీ, షాజహాన్, సానియా, షబానా, సావిత్రి, గుత్తికి చెందిన సుజాత, ఎమ్మిగనూరుకు చెందిన నాగవేణి, పత్తికొండ మండలం హోసూరుకు చెందిన వంశీకృష్ణ గాయపడ్డారు. వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన కవిత, జయమ్మ, నాగవేణి, వంశీకృష్ణను అనంతపురం, కర్నూలుకు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని గుత్తి ఆర్టీసీ డిపో అధికారులు పరిశీలించారు. బస్సు ఢీకొన్నా లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన నాగవేణి,వంశీకృష్ణ


