
కూటమి పాలనంతా మోసమే
● కుట్రలతో జగనన్నపై ఉన్న ప్రజాభిమానాన్ని ఆపలేరు
● ‘చంద్రబాబు మోసం’ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి శైలజనాథ్
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో కూటమి పాలన మొత్తం మోసాలతోనే సాగుతోందని, సంక్షేమమనేది మటుమాయమైందని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజక వర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముద్రించిన‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని సోమవారం శింగనమలలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు రామాలయంలో పుస్తకావిష్కరణ జరగాల్సి ఉండగా.. అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై శైలజనాథ్ మండిపడ్డారు. అనంతరం కల్యాణ మంటపానికి వేదిక మార్చారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రజాదరణ, ఉనికిని చూసి టీడీపీ నాయకులు భయపడుతున్నారన్నారు. దీంతో పోలీసులను అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యక్రమాలను అడ్డుకునే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఏడాది పాలనలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా విధ్వంసాలకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై రోజురోజకూ అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీను కూడా పక్కాగా అమలు చేయని అసమర్థ స్థితిలో పాలకులు ఉన్నారన్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనపై ప్రజలను చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని జైళ్లలో పెట్టించినా భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు యోగీశ్వరి, వెంకటనారాయణ, భూమిరెడ్డి రాఘవరెడ్డి, జెడ్పీటీసీలు నీలం భాస్కర్, భోగాతి ప్రతాపరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, మండల కన్వీనర్లు రఘునాథ్రెడ్డి, బాలకృష్ణ, నాగేశ్వరరావు, గువ్వల శ్రీకాంతరెడ్డి, బండ్లపల్లి ప్రతాపరెడ్డి, శ్రీరామిరెడ్డి, భాస్కర్రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.