
సీనరేజీ రూపంలో రావాల్సిన డబ్బు
జీఓ నంబర్ 6తో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లకు భారీ లబ్ధి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.3,200 కోట్ల విలువైన రోడ్ల పనులు
కూటమి సర్కారు నిర్వాకంతో రూ.130 కోట్ల వరకూ ఖజానాకు నష్టం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మైనింగ్ మాఫియాకు స్వయానా సర్కారే ఊతమిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికే కొందరు యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్, క్వార్ట్జ్ తదితర ఖనిజాలను అక్రమంగా తర లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్న బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన జీఓ చర్చనీయాంశంగా మారింది. ‘రోడ్డు నిర్మాణ పనుల్లో తవ్విన మట్టిని ఎక్కడికై నా తోలుకోండి, పైసా కట్టక్కర లేదు’ అన్న రీతిలో ఇచ్చిన జీఓ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రహదారి నిర్మాణ కాంట్రాక్టర్లకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లుగా తెలుస్తోంది.
కోట్లాది రూపాయల నష్టం
ఈ ఏడాది జనవరి 20న జీఓ నం.6ను ప్రభుత్వం విడుదల చేసింది. కాంట్రాక్టర్లకు రూ.కోట్లకు కోట్లు దోచిపెట్టే జీఓగా దీన్ని అభివర్ణిస్తున్నారు. గతంలో ఏవైనా పనుల నిమిత్తం రోడ్డులో తవ్విన మట్టిని ఆ సమీపంలోనే ఏర్పడిన గుంతలను పూడ్చడానికి, అక్కడే ఇతర అవసరాలకు వాడుకో వాలనే నిబంధన ఉండేది. మట్టిని ఏవైనా కారణాలతో లారీ లేదా టిప్పర్ల ద్వారా అర కిలోమీటరు దూరం తరలించినా సీనరేజీ కట్టాల్సి ఉండేది. అయితే, కూటమి సర్కారు జీఓ ద్వారా ఇందుకు మినహాయింపు నిచ్చింది. మట్టిని ఇష్టమొచ్చినట్లు ఎక్కడికైనా తర లించేలా అవకాశం కల్పించింది.దీంతో కాంట్రాక్టర్లు భారీగా గుంతలు తవ్వుతూ ఆ మట్టిని ఇతర పనులకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో సహజ వనరులు లూటీ కావడం ఒకెత్తయితే, సర్కారుకు సీనరేజీ రూపంలో వచ్చే ఆదాయంలో భారీగా కోత పడిందని మైనింగ్ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.3,200 కోట్ల పనులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం మొదలు తాడిపత్రి వరకూ రూ.3,200 కోట్లతో వివిధ మార్గాల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. పుట్టపర్తి, పెనుకొండ, గుత్తి ఇలా పలు రహదారి పనులు చేపడుతున్నారు. ఈ రోడ్డు పనుల్లో భాగంగా మట్టిని తరలిస్తే కనీసం రూ.130 కోట్లకు పైనే సీనరేజీ వస్తుందని అధికారుల అంచనా. కానీ జీఓ నం.6తో ఒక్క పైసా రాలేదు. ఉదాహరణకు శింగనమల వద్ద పనులు జరుగుతుంటే ఆ మట్టిని కదిరివైపు తరలిస్తున్నారు. ఇలా పనులు ఒక చోట, మట్టిని మరోచోటుకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
భారీగా ముడుపులు
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే జీఓ.6కు సంబంధించి కూటమి సర్కారు పెద్దలకు భారీ ముడుపులు అందినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్లలో సీనరేజీ నష్టపోతున్న పరిస్థితుల్లో... ముఖ్య నేతలకు రూ. కోట్లలో ముడుపులు చెల్లించి జీఓ విడుదల చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనరేజీ చార్జీలు లేకపోవడంతో ఖజానాకు భారీ నష్టం చేకూరుతోంది.