అమ్ముకుంటాం.. అప్పజెప్పండి | - | Sakshi
Sakshi News home page

అమ్ముకుంటాం.. అప్పజెప్పండి

Jun 18 2025 3:25 AM | Updated on Jun 18 2025 3:25 AM

అమ్ముకుంటాం.. అప్పజెప్పండి

అమ్ముకుంటాం.. అప్పజెప్పండి

ఆత్మకూరు: రైతులకు 40 శాతం రాయితీతో అందిస్తున్న విత్తన వేరుశనగ ఆత్మకూరు మండలంలో పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నప్పటి నుంచి కబ్జాలు, దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు తాజాగా విత్తన వేరుశనగపై కూడా కన్నేసినట్లు తెలిసింది. వేరుశనగ బస్తాలను ఎలాగోలా కొట్టేసి వ్యాపారులకు అమ్ముకునేలా ప్లాన్‌ వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టీడీపీ నేతల కక్కుర్తిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మకూరు మండలానికి ప్రభుత్వం 1,900 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించింది. ఇప్పటి వరకు 1,400 క్వింటాళ్ల వరకు మండలానికి చేర్చింది. అయితే, వ్యాపారులతో కుమ్మకై ్కన టీడీపీ నేతలు మండలంలో పలు చోట్ల విత్తన వేరుశనగ బస్తాలను తమకు అప్పజెప్పాలని వ్యవసాయ శాఖ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం మాది.. మాకు వేరుశనగ బస్తాలు కావాలి.. వేలిముద్రలు మీరే రైతుల దగ్గర వేయించుకోండి. కావాలంటే ఎమ్మెల్యే ఇంటి నుంచి ఫోన్‌ చేయిస్తాం’ అంటూ వ్యవసాయ శాఖ సిబ్బందిపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరం లేకపోయినా రైతులను రైతు సేవా కేంద్రాలకు పిలిపించి వేలిముద్రలు వేయించాక వ్యాపారులు వేరుశనగ కాయలు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మండలంలోని ఓ గ్రామంలో విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభం కాకముందే కొంత మంది టీడీపీ నేతలు రైతులతో ఒక లోడ్‌కు వేలిముద్రలు వేయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరో గ్రామంలో రైతు సేవా కేంద్రానికి వెళ్లి ‘మాకు ఒక లోడ్‌ వేరుశనగ కాయలు కావాలి.. అవసరమైతే ఎమ్మెల్యే ఇంటి నుంచి ఫోన్‌ చేయిస్తాం.. లోడ్‌ మాకిచ్చి మీరు వేలిముద్రలు వేయించు కోండి’ అని బెదిరించినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల ఒత్తిళ్లతో వ్యవసాయ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే పేరు చెబుతూ ‘పచ్చ’ నేతలు హల్‌చల్‌ చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘తమ్ముళ్ల’ నిర్వాకంతో తమకు విత్తనాలు అందకుండా పోతాయేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పంపనూరులో విత్తన వేరుశనగ పంపిణీని ప్రారంభించిన కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘విత్తన కాయలు అర్హులైన రైతులకు మాత్రమే అందాలి. పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని’ హెచ్చరించినా ‘పచ్చ’ నేతలు బరితెగించడం గమనార్హం.

ఆత్మకూరు మండలంలో కొందరు టీడీపీ నేతల కక్కుర్తి

వ్యాపారులతో కుమ్మక్కై విత్తన

వేరుశనగ పక్కదారి పట్టించేలా ప్లాన్‌

ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ పన్నాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement