బసవేశ్వరుని జీవితం ఆదర్శప్రాయం | - | Sakshi
Sakshi News home page

బసవేశ్వరుని జీవితం ఆదర్శప్రాయం

May 1 2025 12:20 AM | Updated on May 1 2025 12:22 AM

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం అర్బన్‌: సమాజోద్ధరణకు కృషి చేసిన మహానుభావుడు బసవేశ్వరుడు అని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. ఆయన జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో బసవేశ్వరుని 894వ జయంతి నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై బసవేశ్వరుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవేశ్వరుడు కవి, ఫిలాసఫర్‌, గురువు, సంఘ సంస్కర్తగా కీర్తింపబడ్డారన్నారు. సమాజం గురించి, మనిషి జీవితమంటే ఏమిటి, ఏమి సాధిస్తే శాంతిని పొందుతారనే విషయాలు చెప్పారన్నారు. ఉత్తర కర్ణాటకలో ఊరూరా పర్యటించి సమాజాన్ని సరిదిద్దే కార్యక్రమం చేపట్టిన మహానుభావుడన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, జిల్లా టూరిజం అధికారి జయకుమార్‌బాబు, డీపీఓ నాగరాజనాయుడు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ అలెగ్జాండర్‌, వీరశైవ లింగాయత్‌ నాయకులు రాజు, సతీష్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

జనావాసాల్లోకి ఎలుగుబంటి

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం పట్టణ శివారు ప్రాంతాలలో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాత్రి దేవీరమ్మ కాలనీలోని జనావాసాల్లోకి ఎలుగుబంటి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. యువకులు గట్టిగా కేకలు వేయడంతో అది ఇళ్ల ముందు నుంచి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసు స్టేషన్‌కు సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. దీంతో ఎలుగుబంట్లు, చిరుతలు సైతం జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రాత్రి అయ్యిందంటే ఏదో ఒక అడవి జంతువు వస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని స్థానికులు వన్నూరుస్వామి, రామాంజినేయులు, బాషా తెలిపారు. కూతవేటు దూరంలోనే అటవీ శాఖ కార్యాలయం ఉన్నా ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టడం లేదని వారు వాపోయారు.

శింగనమలలో

టైప్‌–4 కేజీబీవీ

అనంతపురం ఎడ్యుకేషన్‌: పేద విద్యార్థినులకు జిల్లాలో మరొక వసతిగృహం అందుబాటులోకి వచ్చింది. దాదాపు ఏడేళ్ల కిందట జిల్లాకు నాలుగు టైప్‌–4 కేజీబీవీలు (వసతి గృహాలు మాత్రమే) మంజూరయ్యాయి. శింగనమల, నార్పల, కుందుర్పి, బొమ్మనహాళ్‌లో ఏర్పాటు చేసేలా ఉత్తర్వులిచ్చారు. ఇందులో ఇప్పటికే భవన నిర్మాణం పూర్తయిన నార్పలలో బాలికల బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించారు. తాజాగా శింగనమలలో భవన నిర్మాణం పూర్తి కావడంతో ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. శింగనమలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న 110 మంది విద్యార్థినులకు వసతి కల్పించనున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ తెలిపారు. ఇక కుందుర్పి, బొమ్మనహాల్‌ మండలాల్లో టైప్‌–4 కేజీబీవీలు నిర్మాణ దశలో ఉన్నాయి.

దరఖాస్తు గడువు పెంపు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని కేజీబీవీల్లో నాన్‌టీచింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఈ నెల మూడు వరకు పొడిగిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లో మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఎంఈఓలను సంప్రదించాలన్నారు.

బసవేశ్వరుని జీవితం ఆదర్శప్రాయం 1
1/2

బసవేశ్వరుని జీవితం ఆదర్శప్రాయం

బసవేశ్వరుని జీవితం ఆదర్శప్రాయం 2
2/2

బసవేశ్వరుని జీవితం ఆదర్శప్రాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement