
కత్తి పోటుకు గురైన యువకుడి మృతి
తాడిపత్రి టౌన్: ఈ నెల 16న కత్తి పోటుకు గురైన యువకుడు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి గ్రామానికి చెందిన మహేష్కుమార్ (29)కు తాడిపత్రిలోని ఓం శాంతి నగర్లో నివాసముంటున్న మణితో వివాహమైంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన భార్యను పిలుచుకెళ్లేందుకు ఈ నెల 16న మహేష్కుమార్ తాడిపత్రికి వచ్చాడు. అదే రోజు తన అత్తింటి పక్కనే ఉన్న ఫైరోజ్ తన కుటుంబసభ్యులు రమీజా, ఖాజీబీతో గొడవపడుతుంటే మహేష్కుమార్ జోక్యం చేసుకుని విడిపించే ప్రయత్నం చేశాడు. అప్పటికే కూరగాయల కత్తితో తన కుటుంబసభ్యురాలిపై ఫైరోజ్ దాడి చేయబోతుండగా అడ్డుగా ఉన్న మహేష్కుమార్ పొట్టను తాకడంతో లోతైన గాటు పడింది. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక (తాడిపత్రి) ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు చిన్నపాటి గాయమేనంటూ మూడు కుట్లు వేసి ఇంటికి పంపారు.అయితే కడుపు నొప్పి అంటూ బాధపడుతుండడంతో మరుసటి రోజు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి పిలుచుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు అడ్మిషన్లో ఉంచుకుని సాధారణ చికిత్స అందిస్తుండడంతో పరిస్థితి కాస్త విషమించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించిన అనంతరం కడుపులో పేగు తెగిందని నిర్ధారించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. దీంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మహేష్కుమార్ సోమవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గొడవ పడుతున్న వారిని విడిపించేందుకు
యత్నించడమే శాపంగా మారిన వైనం