నక్కపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్టీ పిలుపు మేరకు మంగళవారం నక్కపల్లి లోటౌన్హాల్(రౌండ్ టేబుల్ )సమావేశం నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు తెలిపారు. సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో మద్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కూటమిప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన డీఎస్సీలో చాలా అక్రమాలు జరిగాయన్నారు. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. అలాగే రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా విడుదల చేయడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించలేదన్నారు. బీసీలకు యాభైఏళ్లకే పింఛను ఇస్తామని మోసం చేసారని ఆరోపించారు. వీటన్నింటిపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించడానికి పార్టీ అఽధిష్టానం కార్యాచరణ రూపొందించిందన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం నియోజకవర్గ మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆందోళనలో చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి వివరించడం, చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదవులు పొందిన వారు, మండల పార్టీ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు పార్టీ బాధ్యులంతా పాల్గొనాలని ఆయన కోరారు.


