తుమ్మపాల: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు కలెక్టరేట్లో సోమవారం ఆమె నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 20, 23న నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అంగనన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మొత్తం 170 మందికి నియామక పత్రాలు అందజేశామన్నారు. గ్రామీణ స్థాయిలో మాతాశిశు సంక్షేమానికి అంగన్వాడీ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని బాధ్యతాయుతంగా సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. మాతాశిశు సంక్షేమం, గర్భిణి అయినప్పటి నుంచి మాతృమూర్తులకు రక్తహీనత (అనీమియా) రాకుండా చూడడం, ఐదేళ్ల లోపు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం అంగనన్వాడీల ప్రాథమిక బాధ్యత అన్నారు. సెంటర్లకు వచ్చే పిల్లలకు నాణ్యమైన ఆహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే మొబైల్ ఫోన్లలో సంబంధిత యాప్ల ద్వారా రోజువారీ హాజరు, బియ్యం/రేషన్ పంపిణీ, సంపూర్ణ పోషణ అమలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ పిల్లలు, గర్భిణులకు పోలియో, ధనుర్వాతం వంటి వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందేలా కార్డ్ ఆధారిత రిజిస్ట్రేషన్, మానిటరింగ్ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, సీడీపీఓలు, ఇమ్యునైజేషన్ అధికారులు పాల్గొన్నారు.
తల్లిపాల వారోత్సవాలపై పోస్టర్ విడుదల
పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం, తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా బిడ్డకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాధించినట్టేనని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, సంబంధిత అధికారులు తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లి, కుటుంబానికి చేరవేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అచ్చుతకుమారి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. చంద్రశేఖర్ దేవ్, శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్యలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓలు పాల్గొన్నారు.


