కె.కోటపాడు: గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు రైతుల నుంచి బలవంతపు భూసేకరణ తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు కోసం రైతులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఎటువంటి గ్రామసభలను నిర్వహించకుండా ఎంఎస్ఎంఈ పార్కు కోసం భూసేకరణ చేపట్టడం అన్యాయమన్నారు. రైతుల మనోభావాలను గుర్తించి ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. సీపీఎం నాయకులు గండి నాయినిబాబు, ఈర్లె నాయుడుబాబు, రైతులు గంగన్నపాత్రుడు, నాగమణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


