
క్షతగాత్రుడు వరహాలనాయుడికి పరామర్శ
ఎన్టీఆర్ ఆస్పత్రిలో వరహాల నాయుడిని
పరామర్శిస్తున్న గొర్రెలు, మేకల పెంపకందారుల
సంఘం జిల్లా చైర్మన్ గంటా శ్రీరామ్
అనకాపల్లి: జిల్లాలో వి.మాడుగుల మండలం ఎం.కృష్ణాపురంలో గొర్రెలు, మేకల పెంపకందారుడు కోళ్ల వరహాలనాయుడిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు భూసమస్య నేపథ్యంలో దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఈ నెల 11న నాయుడు కుటుంబ సభ్యులు అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పటించుకోలేదని జిల్లా గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం చైర్మన్ గంటా శ్రీరామ్ ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్షతగాత్రుడు కోళ్ల వరహాలనాయుడిని సోమవారం సంఘం సభ్యులు పరామర్శించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో నాయుడుకు అండగా నిలబడుతూ ఎస్పీ తుహిన్ సిన్హాకు వినతిపత్రం అందజేశారు. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో ఈ నెల 18న మాడుగుల తహసీల్దార్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ సబ్బి శ్రీనివాసరావు, ఎం.కృష్ణాపురం మాజీ సర్పంచ్ మొల్లి అప్పారావు, జిల్లా కార్యదర్శి గోకాడ దేముడునాయుడు, తదితరులు పాల్గొన్నారు.